KCR : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. అధికారంలో ఉన్నప్పుడు కనీసం ప్రజలను పలకరించని బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ వారిని కలిసేందుకు నిర్ణయించుకుంటున్నారు. పదేళ్లు పాలనలో ఉండగా ఏనాడు రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారానికి దూరం కాగానే వారి సమస్యలు గుర్తుకు వచ్చాయా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
రాష్ట్రంలో ఏర్పడిన కరవు పరిస్థితుల నేపథ్యంలో వారిని ఓదార్చేందుకు కేసీఆర్ నిర్ణయించుకున్నారు. బస్సు యాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రాంతాలను చుడుతూ రైతుల కన్నీరు తుడవాలని భావిస్తున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ విధానాల వల్లే కరవు ఏర్పడిందని చెప్పే ప్రయత్నం చేయనున్నారు. దీని కోసం రూట్ మ్యాప్ కూడా ఖరారు చేసుకోనున్నారు.
ఈ నెల 18న పార్టీ నిర్వహించే సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకోనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను టార్గెట్ చేసుకుని వారి వల్ల కరువు ఏర్పడిందని చెప్పే ప్రయత్నం చేస్తారని తెలుస్తోంది. తాము అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకున్నామని చెప్పనున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టాలని కోరనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ వల్ల రాష్ట్రానికి అధోగతి జరుగుతుందని చెబుతున్నారు. ఆ పార్టీ విధానాలే ఇప్పుడు గుదిబండలా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బస్సు యాత్ర నిర్వహించి రైతుల్లో చైతన్యం నింపాలని చూస్తున్నారు. దీని కోసం పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. రైతుల పక్షాన పోరాడి వారి సమస్యలు తీర్చేందుకు పాటుపడాలని సూచిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా బీఆర్ఎస్ కు వేయాలని చెప్పాలని చూస్తున్నారు. కాంగ్రెస్ అసమర్థ పాలనకు కాలం చెల్లిందని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని ఆదరించాలని కోరనున్నారని తెలుస్తోంది.