BRS : కేసీఆర్ అమరణ దీక్ష తర్వాతి నుంచి ఇప్పటిదాక తెలంగాణలో బీఆర్ఎస్ కు తిరుగులేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో ఆ పార్టీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు ఆ పార్టీని కలవరపెడుతున్నాయి. నిన్నటి దాక కేసీఆర్ దర్శనం కోసం పడిగాపులు కాచిన నేతలంతా ఇప్పుడు వేరే పార్టీలో చేరిపోవడం, గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇతర పార్టీల టచ్ లోకి వెళ్లిపోతుండడంతో కేసీఆర్ దిక్కుతోచని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.
గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో సత్తా చాటిన బీఆర్ఎస్ కు అక్కడ ఎంపీ అభ్యర్థులు దొరకడం లేదు. అధికారంలోకి ఉండగా అన్నీతానై పార్టీని నడిపించిన కేటీఆర్ విపక్షంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పార్టీని కాపాడుకోలేకపోవడం, హరీశ్ రావు తన జిల్లా రాజకీయాలకే పరిమితం కావడంతో కేసీఆర్ మళ్లీ రంగప్రవేశం చేయకతప్పలేదు.
లోక్ సభ ఎంపీగా పోటీ చేయాలంటే కోట్ల వ్యవహారమే. కోట్లు ఖర్చు పెట్టుకుని గెలిచిన తర్వాత వ్యాపారవేత్తలు, సంపన్నులు తమ ప్రయోజనాలు నెరవేరాలని కోరుకుంటారు. కానీ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతో ఎంపీ సీటు తమకు వద్దంటే వద్దు అంటున్నారు. గతంలో కేసీఆర్ తో క్లోజ్ గా ఉన్న సంపన్నులు సైతం ఇప్పుడు మొహం చాటేస్తున్నారు.
ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు ముగ్గురు వేరే పార్టీల్లోకి చేరిపోయారు. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి పోటీ చేయలేనని అంటున్నారు. మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ఆయన బంధువులు కాంగ్రెస్ లో చేరిపోయారు. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం సీట్ల కోసం బీఆర్ఎస్ నుంచి ఒక్క దరఖాస్తు వచ్చే అవకాశం లేదు. ఖమ్మం జిల్లాలో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం కాంగ్రెస్ బాట పట్టారు. ఇక ఖమ్మం సీటును నామా నాగేశ్వరరావుకే ఖరారు చేశారు. కానీ ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తారన్న ప్రచారం ఊపందుకుంది. సికింద్రాబాద్ సీటును తలసాని సాయిని బరిలో దించాలని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటకపోతే పార్టీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది.