Settlers Challenge : స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అభియోగాలు మోపుతూ చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణ, ఏపీ మధ్య కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చంద్రబాబుకు శాంతియుతంగా సంఘీభావం తెలిపిన ఐటీ ఉద్యోగులను హైదరాబాద్ లో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఆంధ్రలో జరిగిన ఘటనలకు హైదరాబాద్ లో ఆందోళనలు చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిరసన కార్యక్రమాలు ఏపీలో చేసుకోవాలంటూ హితవు పలికారు. దీనిపై టీడీపీతో పాటు ఐటీ ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు..
తెలంగాణలో ఉన్న సెటిలర్ల ఓట్లు మాత్రమే కేటీఆర్ కు అవసరముందా అంటూ ప్రశ్నించారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఎన్నికల ముందు చేసింది కేవలం ఓట్ల కోసం కాకుంటే దేనికని ప్రశ్నించారు. ఆంధ్రాకు కూడా కంపెనీలు పెట్టాలని తాము చెబుతామని కేటీఆర్ చెప్పడం ఏపీ ప్రజలను అవమానించడమేనని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు అరెస్టు వెనుక ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ హస్తం ఉందని అందరికీ తెలుసునని సదరు వ్యక్తి వ్యాఖ్యానించారు. హైదరాబాద్ అభివృద్ధికి పునాది వేసిందే చంద్రబాబు అని, అలాంటి వ్యక్తిని ఇలా ఇబ్బంది పెట్టి కక్ష సాధింపు చర్యలకు దిగడంపై విమర్శలు వస్తున్నా ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఇక మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ కు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని స్పందించారు.
అయితే ఇక్కడ బీఆర్ఎస్, వైసీపీ కలిసి రాజకీయాలు చేస్తున్నాయనడంలో ఎలాంటి అనుమానం లేదు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో సహకరించారు. దీనికి ప్రధాన కారణం టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడమేనని అందరికీ తెలుసు. ఓటుకు నోటు వ్యవహారంతో పాటు ఎన్నికల సమయంలో చంద్రబాబు సర్వశక్తులు తెలంగాణలో ఒడ్డారు. దీంతో రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అంటూ నాడే కేసీఆర్ ప్రకటించారు. చెప్పినట్లుగానే ఏపీలో నాటి ప్రతిపక్ష పార్టీ వైసీపీకి అన్ని విధాలుగా సాయం అందించారు.
ఇక ఆ తర్వాత కేసీఆర్, చంద్రబాబుకు దూరం పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఇటు తెలంగాణ, అటు ఏపీ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ సంచలనమైంది. తెలంగాణలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నుంచి సహకారం ఉంటుందని భావించే చంద్రబాబును కొంతకాలం జైల్లో ఉంచాలని ఇరు పార్టీల ప్రయత్నమని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు ఏపీలో కొంతకాలం ప్రజలకు దూరంగా చంద్రబాబును ఉంచాలని కూడా జగన్ ఆలోచన. అయితే ఇప్పుడు ఇది అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేసింది. ఈ ఇరుపార్టీల ఆలోచనలకు కేంద్రంలోని బీజేపీ అండగా నిలిచిందని ఈ అరెస్టు వ్యవహారం, కోర్టు్ల్లో విచారణ ప్రక్రియ చూస్తుంటేనే అర్థమవుతున్నదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.