perni nani : పేర్ని నాని.. ఏపీ రాజకీయాల్లో వైసీపీకి కీలక నేత. మాజీ మంత్రి. టీడీపీ, జనసేన నేతల మీద విమర్శలు చేయడంలో ముందుంటారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. కొన్ని సమీకరణాల కారణంగా మంత్రి పదవి కోల్పోయినా ఏపీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు. కృష్ణ జిల్లా మచిలీ పట్నం ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు.
అయితే మంగళవారం ఆయన నియోజకవర్గ పర్యటనలో ఉన్నారు.
ఈ క్రమంలో మండు టెండలో ఓ వృద్ధురాలు కాళ్లకు చెప్పులు లేకుండా నడుస్తుండడాన్ని గమనించారు. వెంటనే కారు ఆపి తన వద్దకు వెళ్లారు. ఆమె పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమె పరిస్థితిని తెలుసుకున్న ఆయన చలించిపోయారు. వెంటనే తన కారులో ఓ ప్రముఖ షోరూం తీసుకెళ్లారు. ఆమెకు నచ్చిన చెప్పుల జత కొనిచ్చారు. ఎమ్మెల్యే నే స్వయంగా తనకు చెప్పుల జత కొనివ్వడంతో ఆ పేద వృద్ధురాలి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీనిని ప్రత్యక్షంగా చూసిన పేర్నినాని ఔదర్యాన్ని అభినందించారు. మండుటెండలో చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతున్న ఆమె దీనస్థితిని తమ ఎమ్మెల్యే అర్థం చేసుకోవడాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు ఎమ్మెల్యేకు ధన్యావాదాలు తెలిపారు.
అయితే అంతకుముందు పేర్ని నాని ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కోసమే పవన్ జనసేన పార్టీని నడిపిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు భజన చెయ్యడమే పవన్ కు తెలుసునని దుయ్యబట్టారు. మరోసారి ఆయనకు ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. రాజకీయాలు ఎలా చేయాలో తన అన్నను చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.