Case Against Former Minister : అంగబలం, అర్థబలంతో చెలరేగి ఒక కుటుంబంపై దాడికి పాల్పడినందుకు మాజీ మంత్రి తమ్ముడిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ ఒక ఇంట్లో చొరబడి వారిని ధూషించడంతో పాటు వారిపై దాడికి పాల్పడ్డారు. ఇంటి వాచ్ మన్ ను అడ్డుకున్న ఆయన, ఆయన అనుచరులు వాచ్ మెన్ పై దాడి చేసి సెల్ ఫోన్ ను ధ్వంసం చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు కావడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని మీడియాకు రిలీజ్ చేశారు. మాజీ మంత్రి అయిన శ్రీనివాస్ గౌడ్ అండదండలతో ఈ ఘాతుకానికి పాల్పడినట్లు నియోజవర్గంలో టాక్ వినిపిస్తుంది.
వివరాల్లోకి వెళ్తే.. కొంత కాలంగా శ్రీకాంత్ గౌడ్ అన్న అండదండలతో అక్రమాలు, భూకబ్జాలకు పాల్పడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో కూడా శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలోనే నియోజకవర్గంలో మాజీ మంత్రి అనుచరులు వీరంగం సృష్టించారు. సీసీ టీవీ ఫుటేజ్ లను ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలు సైతం అందాయి.
ఈ నెల (డిసెంబర్) 2వ తేదీ శ్రీకాంత్ గౌడ్ ఆయన అనుచరులతో ఒకరి ఇంట్లోకి చొరబడి వీరంగం సృష్టించారు. శ్రీనివాస్ గౌడ్ జిందాబాద్.. అంటూ ఇంట్లోని ఫర్నీచర్ ను ధ్వంసం చేసినట్లు పిటిషనర్ పేర్కొన్నారు. 3వ తేదీ లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిగా.. బాధితులు మెల్లగా బయటకు వచ్చారు. శ్రీకాంత్ గౌడ్ చేతిలో ఆ రోజు తీవ్రంగా గాయపడ్డట్లు చెప్పి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు శ్రీకాంత్ గౌడ్, అతని అనుచరులపై కేసులు నమోదు చేశారు.
తమను చంపుతామని బెదిరించారని తమకు శ్రీకాంత్ గౌడ్ చేతిలో ప్రాణహానీ ఉందని సదరు వ్యక్తి పిటిషన్ లో పేర్కొన్నారు. తమకు అయితే సీసీ టీవీ ఫుటేజీ, హార్డ్ డిస్క్ లను సైతం ధ్వంసం చేశారని వారు మండిపడ్డారు. ఏది ఏమైనా శ్రీకాంత్ గౌడ్, ఆయన అన్న శ్రీనివాస్ గౌడ్ తరుతో పలువురు పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఘటనలు బీఆర్ఎస్ హయాంలో జరిగాయని గుసగుసలు వినిపిస్తు్న్నాయి.