Weather Report : భానుడు భగ్గుమంటున్నాడు..రోజురోజుకూ మరింత సుర్రుమంటున్నాడు. ఏప్రిల్ లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అన్ని జిల్లాల్లోనూ వడగాలుల తీవ్రత పెరిగింది. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో జనాలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు తమిళనాడు, కర్నాటక, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో వేడిగాలులు వీస్తున్నాయి. అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లొద్దని అంటున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రాష్ట్రంలోని 19 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం, కర్నూలు, నందిగామ, కావలి, తుని, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు 4 నుంచి 6 డిగ్రీల మేర పెరిగాయి. శనివారం 127 ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు, 237 మండలాల్లో వడగాలులు వీయగా.. ఆదివారం 64 మండలాల్లో తీవ్ర, 222 మండలాల్లో సాధారణ వడగాలులు వీయవచ్చని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
విజయనగరంలోని 24 మండలాలు, శ్రీకాకుళం 15, పార్వతీపురం మన్యం 11, అనకాపల్లి 7, కాకినాడ 4, తూర్పు గోదావరి, విశాఖల్లోని ఒక్కో మండలంలో తీవ్ర వడగాలులు వీచే అవకాశముంది. అల్లూరి సీతారామరాజు, బాపట్ల, ఏలూరు, గుంటూరు, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోనూ వడగాలుల ప్రభావం ఉంటుంది.
వడదెబ్బ లక్షణాలు:
– వడదెబ్బ తగిలితే కళ్లు బైర్లు కమ్మడం, తల తిరిగినట్లు అనిపిస్తుంది.
– వడదెబ్బకు గురైన వారికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతారు. నాలుక తడారిపోతుంటుంది.
– గుండె వేగంగా కొట్టుకోవడం, దాహం తీవ్రంగా ఉంటుంది.
– వాంతులు, విరేచనాలు, అతిసారం బారిన పడుతుంటారు.
-తలనొప్పి, కొద్దిపాటి జ్వరం లక్షణాలు కనిపిస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
– నీళ్లు ఎక్కువగా తాగాలి. బయట పనిచేసేవాళ్లు కొబ్బరినీళ్లు, జ్యూసులు, చల్లటి నీళ్లు తరుచుగా తాగాలి. వీటి ద్వారా డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం.
– ముదురు రంగు బట్టలు వేడిని గ్రహిస్తాయి. అందుకే లేత రంగు, తెలుపు రంగు బట్టలు ధరించాలి. బిగుతు బట్టల కంటే వదులుగా ఉండేవి వేసుకోవాలి.
– ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు తిరగకపోతేనే మంచిది.
– ఒకవేళ ఎండకు వెళ్లడం తప్పదు అనుకుంటే గొడుగు తీసుకెళ్లాలి. క్యాపులు ధరించాలి.
వడదెబ్బ సొకితే ఇలా చేయాలి:
-వడదెబ్బ సోకిన వారిని చల్లటి గాలి, వెలుతురు ధారళంగా వచ్చే గదిలో ఉంచాలి.
– నిమ్మరసం, మంచినీళ్లు, కొబ్బరినీళ్లు తరుచు అందించాలి. గ్లూకోజ్ లాంటివి కూడా అందించాలి.
– వారిని ప్రశాంతంగా ఉండనివ్వడంతో పాటు అవసరమైతే డాక్టర్ ను సంప్రదిస్తే మంచిది.