Lokesh with National Media : రాజకీయ నాయకులు ఎంత పెద్ద పదవిలో ఉన్నా ప్రెస్మీట్ లో మీడియా ప్రశ్నలకు కొన్ని సందర్భాల్లో స్పాంటేనియస్ గా సమాధానాలు చెప్పలేకపోతుంటారు. అటువంటి వారిలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. ఆయన బటన్ నొక్కుడు సభల్లో ఎంతసేపైనా మాట్లాడగలరు. ఎందుకంటే అక్కడ తను చెప్పేది విని చప్పట్లు కొట్టేవారే తప్ప ప్రశ్నించేవాళ్ళు ఉండరు కనుక. అదే ప్రెస్మీట్లో అయితే ఎవరు ఏ ప్రశ్న సందిస్తారో ఊహించలేము. వాటికి జవాబు చెప్పడం కూడా చాలా కష్టం. ముఖ్యంగా వైసీపీ పాలన చూసిన తర్వాత అడిగేందుకు వేలాది సమాధానం లేని ప్రశ్నలున్నాయి. కనుక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి కూడా ప్రెస్మీట్ పెట్టి మీడియాను ఒంటరిగా ఎదుర్కోలేదని అందరికీ తెలుసు. కానీ సింహం సింగిల్గానే వస్తుందనే డైలాగ్ చెప్పడం మరిచిపోరు.
జగన్ చేయలేకపోయిన ఈ పనిని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఒక్కసారి కాదు. యువగళం పాదయాత్రలో కనీసం ఓ వందసార్లు చేసి ఉంటారు. ఎక్కడికక్కడ మీడియా సమావేశాలు, ప్రజలతో ముఖాముఖి సమావేశాలు, హలో లోకేష్ వంటి కార్యక్రమాలలో తనను అనేక అంశాలపై ప్రశ్నించే మీడియా ప్రతినిధులను, వివిధ వర్గాల ప్రజలను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కొని సంతృప్తికరమైన సమాధానాలు చెప్పి మెప్పించిన సంగతి తెలిసిందే. యువగళంలో ఆ అనుభవమే ఇప్పుడు ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించేందుకు ఎంతగానో ఉపయోగపడింది. వైసీపీ నుంచి తప్పుడు సమాచారం అందుకొన్న జాతీయ మీడియా ప్రతినిధులు నారా లోకేష్ మీద ఆకలిగొన్న సింహాల్లా ప్రశ్నల వర్షం కురిపించారు. “మీ తండ్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడి జైలుకి వెళితే మీరు ఏవిధంగా ఆయనను సమర్ధిస్తున్నారు?” అని ప్రశ్నించారు. గతంలో లోకేష్ తడబడేవారు.
కానీ ఇప్పుడు ఏమాత్రం బెదరకుండా ధైర్యంగా సమాధానం చెప్పారు. చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తున్న ఏపీ సీఐడీ కూడా చంద్రబాబు నాయుడు నేరం చేశారని నిరూపించే ఒక్క సాక్ష్యం చూపించలేకపోయిందని, అందుకే ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేయడానికి భయపడిందని ధీటుగా సమాధానమిచ్చారు. తన తండ్రి అవినీతికి పాల్పడలేదని నిరూపించేందుకు తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని వాటితో న్యాయపోరాటం చేసి విడిపించుకొంటానని ధీటుగా జవాబు చెప్పారు. చంద్రబాబు అంటే అభివృద్ధి, ఐటీ కంపెనీలు, పరిశ్రమలే తప్ప అవినీతికాదని, జాతీయ మీడియాలో అనేక సార్లు వచ్చిన వార్తలే ఇందుకు నిదర్శనం అని లోకేష్ తనదైన శైలిలో చెప్పడంతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.
ఏపీలో జగన్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా తమను ఎంతగా వేధిస్తోందో ఈ సందర్భంగా లోకేష్ జాతీయ మీడియాకు వివరించగలిగారు. ఈ వేధింపులకు పరాకాష్టగా చంద్రబాబును అరెస్ట్ చేసిందని స్పష్టం చేవారు. ఇక ముందుకు కూడా టీడీపీ నేతలందరిపై అనేక కేసులు పెట్టి వేధించబోతున్నామని ఏపీ మంత్రులే స్వయంగా చెప్పుకొంటున్న విషయాన్ని జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్లారు లోకేష్. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి అప్పులు, ఆరాచకాలు పెరిగిపోయాయని వివరించగలిగారు. చంద్రబాబుకు న్యాయం జరగడంలో ఆలస్యం అవుతుందేమో కానీ తప్పకుండా తన నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఒకప్పుడు ప్రజల మధ్యకు వెళ్లి మాట్లాడాలంటే తడబడే లోకేష్ ఇప్పుడు ఢిల్లీకి వెళ్లి అక్కడ జాతీయ మీడియాను పిలిచి మరీ ఒంటరిగా ఎదుర్కొవడం ఆశ్చర్యానికి గురి చేసింది. గత ఎన్నికలలో వైసీపి నేతలు నారా లోకేష్ను ‘పప్పు, పప్పు’ అంటూ ఎంతగా అవహేళన చేశారో అందరికీ తెలుసు. అప్పటి నుంచే నారా లోకేష్ తనను తాను మలుచుకొంటూ మంచి వక్తగా ఎదగ గలిగాడు. నారా లోకేష్ తన తండ్రిలాగే కష్టాలు, సవాళ్లకు ఎదురీది అన్నీ నేర్చుకుంటున్నారు. కానీ ఈ నాలుగేళ్లలో వైసీపీ నేతలు మాత్రం బుద్ధి హీనులుగా మిగిలిపోతున్నారు. వారు నేర్చుకొన్నది ఒక్కటే.. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్లను అవహేళన చేయడం మాత్రమే. మంత్రులు తమ శాఖల గురించి, నేతలు సంక్షేమ పధకాల గురించి సాధికారంగా మాట్లాడలేని దుస్థితిలో ఉన్నారు.