Yatra 2 :
ప్రజలకు దగ్గరైనవాడే నిజమైన నాయకుడు అంటూ పాదయాత్ర ప్రారంభించాడు దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించిన సుధీర్ఘ యాత్ర అనంతరం ఆయన సీఎం అయ్యారు. ప్రజల కష్టాలను దగ్గరి నుంచి చూసిన ఆయన కష్టాలు తీర్చేందుకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత అనుకోని విధంగా కన్ను మూశారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో చేసిన పాదయాత్రపై మహీ వీ రాఘవ్ ‘యాత్ర’ సినిమా తీశారు. ఆయన వేసిన మొదటి అడుగు నుంచి చివరి అడుగు వరకు కలిగిన అనుభవాలు, తెలుసుకున్న ప్రజల బాధలను ఈ చిత్రంలో చూపించారు మహి వీ రాఘవ్.
అదే ఇన్ఫిరేషన్ తో ఇప్పుడు యాత్రకు సీక్వెల్ గా ‘యాత్ర 2’ చేయబోతున్నారు మహి వీ రాఘవ్. ‘నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. నేను వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుని’ అంటూ ఫస్ట్ లుక్ ను ఇటీవల రిలీజ్ చేశారు మేకర్స్. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ‘ఓదార్పు యాత్ర’ ప్రారంభించారు. తన తండ్రి చావును తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న వారిని పలకరిస్తూ ముందుకు సాగాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను తెలుసుకునేందుకు వందలాది కిలో మీటర్ల పాదయాత్ర చేశాడు.
తండ్రి జీవితంలోని ఘట్టాలను తెరకెక్కించిన మహి వీ రాఘవ్. ఇప్పుడు కొడుకు జీవితంలోని ఘట్టాలను కూడా తెరకెక్కించబోతున్నారు. ఇది నిజంగా అరుదైన సినిమాగానే చెప్పవచ్చు. ‘యాత్ర 2’కు ప్రొడ్యూసర్ గా శివా మేక బాధ్యతలు తీసుకున్నారు. ఈ మూవీ ఫిబ్రవరి, 2024లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే విడుదల చేసి జగన్ యాత్రలో పడిన కష్టాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక్క సారి గుర్తు చేయనున్నారు.
తండ్రి మరణం తర్వాత పార్టీని స్థాపించి దాన్ని ప్రభుత్వంలోకి తెచ్చేందుకు పడిన కష్టాన్ని ఈ మూవీలో మహి వీ రాఘవ్ చూపించనున్నారు. ఏపీలోని పేదల కష్టాలు, కన్నీళ్లు దగ్గరుండి చూసిన నేత పదవిలోకి వస్తే వారి కోసం ఏం చేశాడన్న కోణంలో కూడా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది.