YCP Tickets Cut : ఏపీలో ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిపక్షాలను అధికార బలంతో ఇబ్బందుల్లోకి నెట్టి తాను మాత్రం సాఫీగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నది. వైనాట్ 175 అంటూ పార్టీ అధినేత, సీఎం జగన్ వారికి దిశానిర్దేశం చేస్తు్న్నారు. ప్రజాబలం ఎలా ఉన్నా ఇది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉత్సాహం నింపింది. అయితే ఇక్కడే వారికి అసలు ట్విస్ట్ మొదలైంది. అందరికీ టికెట్లు ఇవ్వబోనని జగన్ తేల్చేశారు. ఇక టిక్కెట్లు దక్కని వారెవరో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. దీంతో వారిలో అసంతృప్తి, నైరాశ్యం మొదలైంది.
ఇక మంత్రులుగా ఉన్న నాలుగురిని లోక్ సభ కు పోటీచేయించేందుకు అధినేత నిర్ణయించారట. ఇక మరికొందరు ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వనని, కొత్తవారికి అవకాశం కల్పిస్తానని నేరుగా చెబుతున్నారు. మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా ఎంపీలుగా పోటీ చేయించే అవకాశం కనిపిస్తున్నది. క్షేత్రస్థాయిలో సానుకూల వాతావరణం ఉన్నదని జగన్ చెబుతున్నా,మరి ఇంత భారీ మార్పులు ఎందుకని ఎమ్మెల్యేలు సీనియర్ల వద్ద ప్రస్తావిస్తున్నారని సమాచారం.
అయితే ఒక సీనియర్ మంత్రి మాత్రం తనకు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఎమ్మెల్యే అభ్యర్థిత్వం తన కొడుకుకి ఇవ్వాలని కోరుతున్నారు. తర్వాత చూద్దాం అంటూ చెప్పాడట. ప్రస్తుతానికి సదరు సీనియర్ మంత్రి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం. ఇక ఒక సీనియర్ మంత్రిని ఎంపీగా పోటీ చేయాలని చెప్పడంతో పాటు అక్కడ మరో మంత్రి లేదా స్పీకర్ తో పోటీచేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే స్పీకర్ తన కుమారుడికి కూడా టికెట్ అడుగుతున్నట్లు సమాచారం. ఇక చాలా చోట్ల నియోజకవర్గాల్లో ఇలాంటి మార్పలకు అవకాశమున్నట్లు తెలుస్తున్నది.
దీంతో పాటు ఎమ్మెల్సీ మహ్మద్ ఇక్బాల్ ను కదిరికి వెళ్లి పనిచేసుకోవాలని చెప్పినట్లు సమాచారం. 2019లో హిందూపురంలో ఓడిపోయిన ఇక్బాల్ ను అక్కడ సమన్వయకర్తగా నియమించారు. అయితే అక్కడ ఆయనను తొలగించి, కొత్తగా దీపికకు చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇక్బాల్ ను కదిరిలో గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు. ఇక విశాఖ తూర్పు బాధ్యతను ప్రస్తుత ఎంపీ ఎంవీవీ సత్యనారాయణకు అప్పగించారు. రాజమహేంద్రవరంలో ఎంపీ మార్గాని భరత్ ను దించాలని యోచిస్తుండగా, ఆయన సమ్మతం తెలపడం లేదు. అయితే చాలా జిల్లాల్లో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలను మార్చాలనే డిమాండ్ ఉంది. అసమ్మతి సెగలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. దీనిపై కూడా సీఎం జగన్ దృష్టి పెట్టినట్లు సమాచారం.
అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు, తూర్పు గోదావరిలో ముగ్గురు, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు, ఇక ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కర్నూల్, మరికొన్ని జిల్లాల్లో ఒక్కొక్కరికి టికెట్ దక్కే అవకాశం లేదని స్వయంగా సీఎం చెప్పినట్లు సమాచారం. ఇక ఏలూరు ఎంపీ ఈసారి పోటీ చేయరని, ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అక్కడ ఓ మాజీ మంత్రిని బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. అనంతపురం జిల్లాలోనూ ఒక సీనియర్ ఎమ్మెల్యేను ఈసారి లోక్ సభ బరిలో దింపనున్నారు.