ఏపీలో విమర్శలు, ప్రతి విమర్శలు తప్ప వినిపించదు.. కాని ఇప్పుడు అధికార వైసీపీ అధ్యాత్మిక వైపు మనసు మళ్లించింది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం- మహా యజ్ఞాన్ని నిర్వహించబోతోంది. దీనికి ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. విజయవాడ దీనికి వేదిక అయింది. రాష్ట్రం సర్వతోముఖాభివృద్దిని సాధించాలనే లక్ష్యంతో ఈ యాగానికి శ్రీకారం చుట్టనుంది. దేవాదాయ మంత్రిత్వ శాఖ ఈ యాగాన్ని పర్యవేక్షించనుంది. రాష్ట్రంలో ఈ తరహా మహా యాగాన్ని నిర్వహించ తలపెట్టడం ఇదే తొలిసారి.
అష్టోత్తర శతకుండ చండీ రుద్ర రాజశ్యామల సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహా యజ్ఞాన్ని జగన్ ప్రభుత్వం నిర్వహించబోతోంది. ఆరు రోజుల పాటు కొనసాగుతుంది. విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. ఈ నెల 12వ తేదీన యాగం ఆరంభమౌతుంది. 17వ తేదీన పూర్ణాహూతితో ముగుస్తుంది. ఈ యాగంలో పాల్గొనడానికి వివిధ పీఠాధిపతులు రాష్ట్రానికి తరలి రానున్నారు.
విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తరాధికారి స్వాత్మ్యానందేంద్ర స్వామి సహా వివిధ పీఠాధిపతులకు ప్రభుత్వం ఆహ్వానించనుంది. వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆరు రోజుల పాటు వివిధ యజ్ఞయాగాదులను 500 మంది రుత్విక్కులు నిర్వహిస్తారు. ఈ నెల 17వ తేదీన పూర్ణాహూతితో రాజశ్యామల యాగం ముగుస్తుంది. వైఎస్ జగన్, భారతి దంపతులు ఇందులో పాల్గొంటారు.
ఈ సంవత్సరం కూడా సకాలంలో వర్షాలు కురుస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని సమంగా సాధిస్తూ, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలవాలని, రాష్ట్రంలో ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి ఆటంకాలు లేకుండా సంక్షేమాభివృద్ధి ముందు సాగాలనే సంకల్పతో వైఎస్ జగన్- ఈ రాజశ్యామల యాగాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నట్లు కొట్టు సత్యనారాయణ చెప్పారు.