senior NTR : అవును నిజమే ఇది.. సీనియర్ ఎన్టీఆర్ ను భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వర్ణ కంకణంతో సత్కరించారు. గాంధీజీ వేషధారణలో వచ్చిన ఎన్టీఆర్ ను చూసి ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తర్వాత రాజకీయాల్లో జవహర్ లాల్ నెహ్రూ వారసురాలు ఇందిరా గాంధీకి సవాల్ విసిరిన నేత ఎన్టీఆర్. కాలేజీ రోజుల్లో నెహ్రూ నుంచి బంగారు పతకం అందుకున్న ఘనత కూడా ఆయనదే. భారతదేశం ముఖ చిత్రాన్ని మార్చిన గొప్ప నేతల్లో జవహర్ లాల్ నెహ్రూ ఒకరు. దేశ స్వాతంత్య్రం కోసం పాటుపడిన సమరయోధుల్లో ఆయనొకరు. మన దేశ తొలి ప్రధాని. తెలుగు జాతికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం, గుర్తింపు తీసుకు వచ్చిన కథానాయకుడు ఎన్టీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రం మార్చిన దిగ్గజ నాయకుడు.
గాంధీగా ఎన్టీఆర్
అప్పటికి మన దేశానికి స్వాతంత్య్రం రాలేదు. తెల్లదొరలకు వ్యతిరేకంగా గాంధీజీ అడుగుజాడల్లో నడుస్తూ వయోబేధం లేకుండా భారత ప్రజలు ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో పాల్గొంటున్న రోజులు. అప్పుడు గుంటూరులోని ఏసీ కాలేజీలో ఓ సంఘటన చోటుచేసుకుంది. ఆ కాలేజీ పాలకవర్గం అంతా యూరోపియన్స్ దే. విద్యార్థులు మాత్రం భారతీయులు. పాలకవర్గానికి, విద్యార్థులకు మధ్య సంఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య శాంతియుత సమన్వయం కుదర్చడానికి గాంధీజీ అనుచరుడైన జవహర్ లాల్ నెహ్రూ ఆ కళాశాలకు వచ్చారు. ఆయన రాకతో భారీ సభ ఏర్పాటు చేశారు.
వేదికపై నెహ్రూ ప్రసంగిస్తున్నారు. సభకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు తరలివచ్చారు. ఒక్కసారిగా సూది పడితే కూడా వినపడేంత నిశ్శబ్దం చోటు చేసుకుంది. సరిగ్గా ఆ సమయంలో… విద్యార్థుల మధ్యలో నుంచి భుజాన కండువా, చేతికర్ర ఆసరాతో ఒకరు చకచకా నడుచుకుంటూ వేదిక వైపు అడుగులు వేస్తున్నారు. నెహ్రూ చూపు కూడా అటు పడింది. ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ‘బాపూజీ! మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? పైకి రండి…’ అంటూ నెహ్రూ ఎదురెళ్లి స్వాగతం పలికారు. గాంధీ వచ్చారని భావించి నెహ్రూ సహా వేదిక కింద ఉన్న విద్యార్థులు సైతం కొన్ని నిమిషాల అలాగే ఉండిపోయారు.
కాసేపటికి కాలేజీ ప్రిన్సిపాల్ వచ్చింది నిజమైన గాంధీజీ కాదని చెప్పారు. ”క్షమించాలి నెహ్రూజీ! మీరు స్వాగతం పలికిన వ్యక్తి అసలు గాంధీ కాదు. మా కాలేజిలో బీఏ చదువుతున్న విద్యార్థి. విచిత్ర వేషధారణ అంటే అతనికి ఎక్కువ మక్కువ” అని నెహ్రూకి ప్రిన్సిపాల్ వివరించారు. గాంధీజీగా నెహ్రూను సైతం నమ్మించిన ఆ విద్యార్థి ఎన్టీఆర్. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, నటన అనేది సినిమాల్లోకి రాకముందు నుంచి ఆయన రక్తంలో ఉంది.
”మహాత్మా గాంధీజీ వేషంలో వచ్చి నన్ను కూడా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తిన ఇతని(ఎన్టీఆర్)కి స్వర్ణ పతకాన్ని బహుమానంగా ప్రకటిస్తున్నాను” అని సభలో ప్రకటించిన నెహ్రూ… ఢిల్లీ వెళ్లాక ఆ బంగారు పతకాన్ని పంపారు. బహుశా నెహ్రూ అప్పుడు ఊహించి ఉండరు… గాంధీ వేషధారణలో తనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విద్యార్థి, తన నుంచి బంగారు పతకం అందుకున్న వ్యక్తి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన వారసురాలు ఇందిరా గాంధీకి ఎన్టీఆర్ సవాల్ విసురుతారని, రాజకీయాల్లోకి వచ్చి సీఎం అవుతారని!