NTR Jayanthi – Dr. Jai Yalamanchili : తెలుగుదేశం వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి.. తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అయిన అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఘనంగా జరుగుతోంది. ఆ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఎన్టీఆర్ తనయుడు, ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు మనవడు జూ.ఎన్టీఆర్, రామకృష్ణ, నటుడు రాజేంద్రప్రసాద్ సైతం నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
నటసార్వభౌముడు, యుగ పురుషుడు, కారణ జన్ముడు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావుకు యూ బ్లడ్ ఫౌండర్, జై స్వరాజ్య్ టీవీ చైర్మన్ డాక్టర్ జై యలమంచిలి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా జై స్వరాజ్య్ టీవీ చైర్మన్ డా. జై యలమంచిలి మాట్లాడుతూ నందమూరి తారకరామారావు రాష్ర్టానికి, పేద ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఢిల్లీ పాలకుల పెత్తనాన్ని తొలిసారిగా ఎదుర్కొని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అఖండ విజయాన్ని సాధించిన గొప్ప నేత అని పేర్కొన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్మరణీయుడని, ఆయన మరణించి పాతికేళ్లయినా ఇప్పటికీ ఆయన సేవలను సదా స్మరించుకోవడం ఇది తెలియజేస్తున్నదన్నారు.
మొట్టమొదటిసారిగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చారని, ఇదే ఆయనను అగ్రపథాన నిలిపిందన్నారు. దీంతో పాటు రాజమండ్రిలో శత జయంత్యుత్సవాల సందర్భంగా జరుగుతున్న మహానాడుకు తన అనుయాయులతో కలిసి భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు. మహానాడు పెద్ద సంఖ్యలో తరలిరావాలని, తెలుగు జాతి ఐక్యతను చాటాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.