CM Jagan for investigation : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ వేగం పెంచింది. ఇప్పటికే ఈ కేసులో అసలు దోషులెవరనే విషయంలో సీబీఐ నిర్ణయానికి వచ్చేసినట్లు తెలుస్తున్నది. అయితే ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అంశంలో సీబీఐకి కొంత ఎదురుదెబ్బ తగులుతున్నది. ఆయనను విచారణకు రావాలని గత మూడు సార్లు ఆయనను పిలిచినా, వివిధ కారణాలు చెబుతూ తప్పించుకుంటూ వస్తున్నారు. అయితే ఇటీవల అవినాష్ ముందస్తు బెయిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. తీర్పును ఈనెల 31కి వాయిదా వేసింది. అయితే ఈ వాదనల్లో కీలక విషయం ఒకటి బయటకు వచ్చింది. ఇందులో ఏపీ సీఎం జగన్ పేరును కూడా తెరపైకి తెచ్చింది.
అయితే వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన కీలక విషయాన్ని అవినాష్ రెడ్డి జగన్ కు చెప్పినట్లుగా సీబీఐ అనుమానిస్తున్నది. వాట్సాప్ కాల్ ద్వారా ఇదంతా తెలియజేసినట్లుగా భావిస్తున్నది. ఇప్పటికే ఈ విషయమై వైఎస్ భారతి పీఏతో పాటు పలువురిని సీబీఐ విచారించింది. ఈ విషయం జగన్ కు తెలిసినా ఎందుకు బయటకు చెప్పలేదనే కోణంలో కూడా సీబీఐ విచారణ ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే అవినాష్ రెడ్డి వెనుక ఉన్న ఓబలమైన శక్తి తమ విచారణకు అడ్డుపడుతున్నదని సీబీఐ పదే పదే చెబుతున్నది. అయితే ఈ విషయంలో ఆ బలమైన శక్తి జగనే అన్నట్లుగా ప్రత్యర్థి వర్గాల నుంచి ఆరోపణలు చేస్తున్నాయి.
మరోవైపు తన అన్నపై నమ్మకం లేకే వైఎస్ సునీత తెలంగాణ హైకోర్టులో కేసు విచారణ జరగాలని కోరిన విషయం అందరికీ తెలిసిందే. అయితే సీబీఐ తాజాగా ఈ కేసులో రహస్య సాక్షి ఉన్నట్లు చెప్పింది. ఆ సాక్షికి ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడే పేరు చెప్పలేమని, న్యాయస్థానానికి మాత్రం తన వాంగ్మూలాన్ని సీల్డ్ కవర్ లో అందజేస్తామని చెప్పింది. అయితే జగన్ అధికారంలో ఉన్నాడు కాబట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని సీబీఐ పరోక్షంగా ఇప్పటికే న్యాయస్థానానికి చెప్పింది. మరి ఈ కేసులో అవినాష్ రెడ్డి తరువాత విచారణకు జగన్, భారతిలను సీబీఐ పిలిచే అవకాశమున్నట్లు సమాచారం.
అయితే జూన్ 30 లోగా కేసును తేల్చాలని సుప్రీం కోర్టు ఆదేశించడం, ఇన్ని ఒత్తి్ళ్లు, రాష్ర్ట పోలీసులు సహకరించకపోవడం, తదితర ఇబ్బందులను దాటి సీబీఐ మరి కేసును తేలుస్తుందా.. మరికొంత కాలం సమయం కావాలని కోర్టును వ్యవధి కోరుతుందా.. వేచి చూడాలి