Bhimili : సినీ, రాజకీయ రంగాల్లో తనదంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసిన ఎన్టీఆర్ కు కొన్ని సెంటిమెంట్లు, కొన్ని ప్రాంతాల మీద ఎనలేని ప్రేమ ఉండేదని ఆయనతో సాన్నిహిత్యంగా ఉన్నవాళ్లు చెబుతుంటారు. తన పూర్తి రాజకీయ జీవితంలో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్టీఆర్ ఎనిమిదేళ్లు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు.
ఒక్కచోటుకే పరిమితం కావొద్దని..
ఎన్టీఆర్ 1983 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ రెండు మూడు అసెంబ్లీ సీట్లలో పోటీ చేశారు. అన్ని ప్రాంతాలు తనకు సమానమేనని నిరూపించడానికేనని అలా ఎంచుకునే వారని చెబుతుంటారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం ఓడిపోతానేమోననే అనుమానంతో అలా ఒక్క చోటనే కాకుండా మరో స్థానంలోనూ పోటీ చేస్తున్నారని విమర్శించేవారు. అయితే అవేమి పట్టించుకొని ఎన్టీఆర్ చివరిసారిగా 1994 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాల్లోనూ పోటీ చేయాలనుకున్నారు. హిందూపురంతో పాటుగా సీటుగా ఉత్తరాంధ్రాలో ఏదో ఒక చోట పోటీయ చేయాలని భావించారు.
అయితే భీమునిపట్నం నుంచి పోటీ చేయాలని ఎన్టీఆర్ చాలా ఆసక్తి చూపారు. అప్పటికే భీమిలీ నుంచి రెండు సార్లు గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యేకి చివరి నిమిషం దాకా భీ ఫారం ఇవ్వలేదని పార్టీలోని అప్పటి సీనియర్ నాయకులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. అయితే భీమిలీ నుంచి పోటీ ఖాయమని అంతా అనుకున్న సమయంలో ఒక్కసారిగా ఆయన మనసు మాత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైపు మళ్లింది.
ఉత్తరాంధ్రాలో అత్యంత వెనకబడిన జిల్లా శ్రీకాకుళం. దీంతో అక్కడి నుంచి పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. దీంతో భీమిలీ నుంచి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యే ముఖ్యమంత్రి అయ్యే చాన్స్ చేజారింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు విశాఖ, భీమిలీపై చాలా ఆసక్తి చూపేవారు.
భీమిలీలో అనేక కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. విశాఖకు దీటుగా భీమిలిని తీర్చిదిద్దుతానని పలుమార్లు హామీలు కూడా ఇచ్చారు. భీమిలీ నుంచి పోటీ చేసి ఉంటే ఈ పట్టణం దశ మరోలా ఉండేదని ఆ ప్రాంత వాసులు నెమరువేసుకుంటున్నారు.