Mass leader : మరో ఐదు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ రానున్నాయి. ఇప్పటికే రేపో,మాపో ముందస్తు రావచ్చుననే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతున్నది. సీఎం కేసీఆర్ ఏ క్షణాన్నైనా ముందస్తు కు వెళ్లొచ్చనే ఊహాగానాలు మొన్నటి వరకు నడిచాయి. ఇప్పడు కూడా అవే రూమర్లు ఉన్నా కేసీఆర్ రాజకీయ చాణక్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.
తెలంగాణలో అధికార బీఆర్ఎస్ తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలను సరిచేసుకుంటూనే ప్రత్యర్థి పార్టీల్లోని నేతలను తమ పార్టీలో చేర్చుకుంటున్నది. అలాగే విపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కూడా అధికార పార్టీలోని అసంతృప్తులను తమ పార్టీలో చేర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోయిన నేతలను తిరిగి రావాలని కోరుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీ కూడా ఇతర పార్టీల నాయకుల వైపు చూస్తున్నది.
హుజురాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కాంగ్రెస్, బీఆర్ఎస్ లలోని అసంతృప్తులను కమలం పార్టీలో చేర్చి కాషాయ కండువాలు కప్పాలని చూస్తున్న ప్రయత్నాలు పూర్తిస్థాయిలో సక్సెస్ కావడం లేదు. చిన్నా చితకా లీడర్లే తప్ప ఎమ్మెల్యే స్థాయి నేతలు చేరడం లేదు. ఈ విషయమై బీజేపీ పెద్దలు ఈటలతో జోరుగా మంతనాలు సాగిస్తున్నారు. ఎన్నికలకు ముందుగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ నుంచి బలమైన నేతలను బీజేపీ లో చేర్చాలని ఆ పార్టీ పెద్దలు ఒత్తిడి చేస్తున్నారు.
కానీ ఈటల ప్రయత్నాలు మాత్రం అనుకున్న విధంగా సాగడం లేదు. బీఆర్ఎస్ ను వీడిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మహబూబ్ నగర్కు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణావు తో ఈటల ఇప్పటికే పలుమార్లు భేటీలు వేశారు. రేపో, మాపో బీజేపీలో చేరబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. అదే సమయలో వారు కాంగ్రెస్ నేతతోనూ చర్చలు జరిపారు. ఇక వారు బీజేపీలో చేరే అవకాశాలు లేవనే తెలుస్తున్నాయి.