southwest : జూన్ సగం గడిచింది. ఇక వర్షాలు పడుతాయి.. విత్తనాలు వేసుకోవచ్చు అని సంబురంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి నిరాశే ఎదురవుతున్నది. ప్రస్తుతం వీస్తున్న వడగాలులతో రెండు తెలుగు రాష్ర్టాలు సతమతమవుతున్నాయి. పగలు బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ వారమంతా ఇలానే ఉంటుందని వాతావరణ శాఖ చెబుతున్నది. నైరుతి రుతుపవనాలు కేరళ తీరం వారం కిందనే దాటినా , వానలు ఎందుకు రావడం లేదని అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ సారి నైరుతి రుతుపవనాలకు రెండు తుఫాన్లు అడ్డుగా వచ్చాయి. మోకా, బిపర్ జోయ్ తుఫాన్లు ఇప్పుడు రుతుపవనాల విస్తరణకు అడ్డుపడుతున్నాయి. సాధారణంగా కేరళ తీరం దాటిన రుతుపవనాలు, వారంలోగా ఏపీలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈ నెల 8న రుతుపవనాలు కేరళ తీరం దాటాయి. ఈసారి వారం ఆలస్యంగా వచ్చాయి. అయితే ఇప్పుడు ఇవి ఆశించినంత వేగంగా ముందుకు కదలడం లేదు. దీంతో వానల రాక మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నది. ప్రస్తుతం రోహిణిని తలపించే ఉష్ణోగ్రతలే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో వడగాలులతో తెలుగు రాష్ర్టాల ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.
రుతుపవనాలు విస్తరించకుండా ఇప్పుడు ఈ రెండు తుఫాన్లే అడ్డు తగులుతున్నాయని వాతావరణ శాఖ చెబుతున్నది. గత నెల 9 న బంగాళాఖాతంలో మోకా తుఫాను ఏర్పడింది. దీంతో బంగాళాఖాతంలో తేమను బంగ్లాదేశ్ వైపు తీరాన్ని దాటించి లాక్కెళ్లింది. దీంతో రుతుపవనాలు అనుకున్న సమయానికి కేరళ తీరం దాటలేకపోయాయి. తాజాగా ఆరేబియా సముద్రంలో జూన్ 6న బిపర్ జోయ్ తుఫాన్ వచ్చింది. ఇది కూడా అత్యంత తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు విస్తరిస్తున్నది. ఇది కూడా రుతుపవనాల విస్తరణను అడ్డుకుంది. ఆరేబియా సముద్రంలోని తేమను తుఫాను ప్రభావిత ప్రాంతం వైపు తీసుకెళ్లడంతో, తెలుగు రాష్ర్టాల్లో వాతావరణం ఇంకా చల్లబడలేదు.
వాస్తవానికి ఈ సమయానికే ఇక్కడ వర్షాలు కురువాల్సి ఉంది. ఇప్పటికైతే అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఎక్కడా ఆశించిన స్థాయి వర్షం పడలేదు. అయితే ఈనెల 18 తర్వాతే రుతుపవనాల ప్రభావం కనిపిస్తుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. బిపర్ జోయ్ తుఫాన్ ప్రభావం ఈ నెల 16 వరకు కొంత తగ్గే అవకాశం ఉండడంతో, ఆ తర్వాతే రుతుపవనాలు తమ వేగం పుంజుకోనున్నాయి. ఈ నెల 20 నాటికి ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించనున్నాయని అక్కడి వాతావరణ శాఖ అంచాన వేస్తున్నది.
ఏదేమైనా ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడం ఈసారి రైతులకు కొంత నిరాశనే మిగిల్చే అవకాశం ఉంది. గత నెలలో అకాల వర్షాలతో ఇబ్బందులు పడ్డ రైతాంగం, వానకాలం సీజన్ సకాలంలో ప్రారంభించాలని ఎదురు చూస్తున్నారు. రుతుపవనాల రాక మరింత ఆలస్యమైతే పరిస్థితి ఎలా ఉంటుందోనని మదన పడుతున్నారు. మరికొందరు వానల రాకల కోసం పూజలు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం ఎండ తీవ్రత, వడగాలులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే వానలు త్వరగా రావాలని ప్రార్థిస్తున్నారు.