YCP leaders : ఏపీలో అధికార పార్టీ నాయకులు పేట్రేగి పోతున్నారు. అధికారం ఉంది కదా అని దాడులు, బెదిరింపులకు తెగబడుతున్నారు. నాలుగేళ్లుగా వైసీపీ నాయకులు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పోలీసులు కూడా ఏం అనలేక చేతులు ముడుచుకొని కూర్చుంటున్నారనే అభిప్రాయం ఏపీలోని అన్ని ప్రాంతాల్లో వినిపిస్తున్నది. నిత్యం ఏదో ఒక చోట దాడులతో వార్తల్లో నిలుస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ఇలాంటి దాడులెన్నో జరిగాయని పలువురు చెబుతున్నారు.
ఇక ఓ వ్యక్తి రెండో భార్య చనిపోతే కడసారి చూపునకు రాలేదని అగ్రహించిన వైసీపీ నాయకులు, ఆమె బంధువులు మృతదేహాన్ని భర్త ఇంటి ముందే పూడ్చి పెట్టారు. ఇక ఇంట్లోకి వెళ్లి వస్తువులన్నీ ధ్వంసం చేశారు. ఈ ఘటన కుప్పం మండలం మల్లానూరు పంచాయతీలోని సింగాపూరంలో గత ఆదివారం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై న్యాయం కోసం బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అందరికీ తెలిసిపోయింది.
సింగాపురం గ్రామానికి చెందిన చెన్నయ్యన్ కు ఇద్దరు భార్యలు. రెండో భార్య రత్నమ్మ కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్నది. అయితే ఆమె అనారోగ్యంతో శనివారం మృతి చెందింది. ఆమెను చూసేందుకు చెన్నయ్యన్ వెళ్ల లేదు. దీంతో బంధువులు స్థానిక వైసీపీ నేతల (YCP leaders) దృష్టికి తీసుకెళ్లారు. నాయకులు, బంధువులు కలిసి ఆమె మృతదేహాన్ని చెన్నయ్యన్ ఇంటి వద్దకు తీసుకెళ్లారు. అక్కడే పూడ్చిపెట్టారు. ఆ సమయంలో చెన్నయ్యన్ ఇంట్లోకి చొరబడి వస్తువులన్నీ పూడ్చి పెట్టారు. బాధితులు ఆ సమయంలో ఇంట్లో లేరు. విషయం తెలుసుకున్న చెన్నయ్యన్ నేరుగా కుప్పం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు, నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.