Nizamabad : పౌరులకు ఏ కష్టం వచ్చినా మాకు న్యాయం చెయ్యడానికి పోలీసులు ఉన్నారులే అనే ధైర్యంతో బ్రతుకుతూ ఉంటారు. దొంగతనాలు జరిగినా, హత్యలు జరిగినా, అల్లర్లు జరిగినా , ఇలా ఎలాంటి దుశ్చర్యలు జరిగిన మన అందరం న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతాం. న్యాయాన్ని కాపాడాల్సిన ఆ పోలీసులే దొంగలుగా మారితే ఇక జనాలు ఎవరి దగ్గరకి వెళ్ళాలి?..సరిగ్గా ఇలాంటి సంఘటనే నేడు నిజామాబాద్ లో జరిగింది.
అసలు విషయానికి వస్తే నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం లో 18 వ వార్డు శ్రీనివాస నగర్ కి చెందిన ఒక వ్యక్తి పెంపుడు కుక్క శనివారం రోజు కనిపించకుండా పోయింది. స్థానిక కాలనీ మొత్తం జల్లెడేసి వెతికినా కూడా తన కుక్క కనిపించలేదు. చివరకు సమీపం లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీ ని గమనిస్తే, పోలీస్ వాహనం తన ఇంటికి సమీపం లో వచ్చి ఆగి ఉండడంని గమనించాడు. ఆ తర్వాత ఆ జీపు నుండి ఒక పోలీస్ బయటకి వచ్చి కుక్కని ఎత్తుకొని వెళ్ళిపోయాడు.
ఆ తర్వాత బాధితుడు పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ సీసీటీవీ ఫుటేజీ ని చూపించగా, ఆ పోలీస్ అధికారి నేనే నీ కుక్కని తీసుకొచ్చాను, ఇదిగో తిరిగి తీసేసుకో, దయచేసి కంప్లైంట్ మాత్రం ఇవ్వకు, నా ఉద్యోగం పోతుంది అని బ్రతిమిలాడాడు అట. పోలీస్ అధికారి స్థాయి వ్యక్తి అంతలా బ్రతిమిలాడడంతో ఆ బాధితుడు చేసేది ఏమి లేక అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
ఈ విషయం సోషల్ మీడియా లో లీక్ అవ్వడం తో నెటిజెన్స్ పోలీసులపై దారుణమైన ట్రోల్ల్స్ వేస్తున్నారు. సక్రమంగా ఉన్న బాధ్యతలని నిర్వహించారు కానీ, బోనస్ గా ఇలాంటివి కూడా చేస్తున్నారు. పోలీసులే ఇలా చేస్తే వీటిని చూసి దొంగలు రెచ్చిపోకుండా ఎలా ఉంటారు?, జీతాలు కాకుండా, లక్షలు లక్షలు ఫైన్ల రూపం లో దండుకుంటూ ఉంటారుగా, ఒక జాతి కుక్కని కొనుక్కోలేరా?, దీనికి కూడా దొంగతనం చెయ్యాలా?, అసలు ఎటు పోతుంది ఈ సమాజం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.