America : అమెరికా.. ప్రపంచ పెద్దన్నగా భావిస్తారు. అయితే ఈ దేశం తీరు మాత్రం నిస్వార్థపు పెద్దన్నలా ఉండకుండా స్వార్థ పెద్దన్నలా ఉంటుందనేది తెలిసిందే. తన దేశ, పౌరుల రక్షణ కోసమే పనిచేస్తూ.. ఇతర దేశాలను తన అవసరాల కోసం తన చెప్పుచేతుల్లో పెట్టుకోవడం దానికి అలవాటే. అమెరికాలో లక్షలాది భారతీయులు ఉంటారు. వీరంతా మిగతా దేశాల పౌరుల్లా కాకుండా నిజాయితీగా, కష్టపడే గుణాన్ని కలిగి అమెరికా ఆర్థిక వ్యవస్థ ఎదగడానికి కృషి చేస్తుంటారు. అమెరికా పౌరుల కంటే తక్కువ జీతాలకే మనవాళ్లు పనిచేయడం వల్ల ఇండియన్స్ అంటే అక్కడి సంస్థలు కూడా మనవాళ్లకు కాస్త ప్రాధాన్యం ఇస్తారు.
అయితే ఈ రెండు దేశాల పౌరుల్లో ఎంతో కొంత స్నేహం ఉన్నా.. అక్కడి ప్రభుత్వాలు మాత్రం మన దేశాన్ని ఎప్పుడూ తన అవసరాలకు అనుగుణంగా వాడుకోవాలని చూస్తూ విఫలమవుతుంటాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏనాడూ అమెరికా మన దేశం వైపు మాట్లాడింది లేదు.. భారత్ లో ఉగ్రవాదానికి కారణమైన పాకిస్తాన్ ను లాలిస్తూ నిధులు పంపుతూ ఉండేది. రష్యాతో మన బంధంపై అమెరికాకు కంటగింపుగా ఉండేది. వాస్తవానికి మన దేశం మొదటి నుంచి ఏ దేశంపైనా కుట్రలు, కుతంత్రాలు పన్నలేదు. అయినా కూడా అమెరికా తన స్వార్థం కోసమే పనిచేసేది.
అమెరికా ట్విన్ టవర్స్ పై అల్ ఖైదా ముష్కరులు దాడి చేయడం.. వారికి పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందని తెలిసినప్పటి నుంచే ఆ దేశానికి దూరమైంది. తనపై దాడి తర్వాత అఫ్గనిస్తాన్ లో అల్ ఖైదా ముష్కరులను మట్టుపెట్టే దాక ఊరుకోలేదు. అలాగే తన రక్షణ అవసరాల కోసం సిరియా, ఇరాన్ యుద్ధం చేసింది. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ వైపు, పాలస్తీనా, ఇజ్రాయిల్ యుద్ధంలో ఇజ్రాయిల్ వైపు పనిచేస్తూ.. తన స్వార్థ పూరిత వైఖరిని బయటపెట్టుకుంటుంది.
చైనాను ఎదుర్కొనేందుకు మన దేశంతో ఇటీవల దోస్తీ చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే 142కోట్ల జనాభాతో మన దగ్గర విస్తృతమైన మార్కెట్ ఉంది. తన కంపెనీలకు ఇక్కడి మార్కెట్ కావాలి. అందుకే పైకి స్నేహం నటిస్తున్నా అంతర్గతంగా ఆ దేశ అవసరాలే ఉంటాయి. అప్పుడప్పుడు మన దేశంపై పలు విషయాల్లో ఒత్తిడి తేవడానికి కూడా చూస్తోంది. భారత్ రష్యా దగ్గర ముడి చమురు కొనడం, ఆయుధాలు కొనడం ఆ దేశానికి సుతారమూ ఇష్టముండదు. అలాగే తాము తయారు చేసే రక్షణ పరికరాలను, యుద్ధ విమానాలను కొనాలని ఒత్తిడి చేస్తుంటుంది. అయితే ఇలాంటి ఒత్తిళ్లకు మన దేశం అస్సలు ఒప్పుకోదు. అందుకే అప్పుడప్పుడు ఏదో ఒక ఒత్తిడి తేవడానికి ప్రయత్నం చేస్తుంటుంది.
తాజాగా, తన దేశంలో ఉండే ఖలీస్థానీ చీఫ్ ను భారత ప్రభుత్వం ‘రా’ ద్వారా చంపడానికి ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేస్తోంది. దీనికి సంబంధించి భారత్ లోని అధికారులతో సమావేశం కావడానికి ఆ దేశ ఎఫ్ బీఐ(ఫెడరల్ బ్యూరో ఆప్ ఇన్వెస్టిగేషన్) చీఫ్ వచ్చారు. అయితే దీని వెనక అసలు కథ మాత్రం.. భారత్ ను రష్యా నుంచి దూరం చేయడమే లక్ష్యం కనపడుతోంది. ఏదో విషయంలో భారత్ ను తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు చేసే ప్రయత్నమే కనపడుతుంటుంది. కానీ భారత్ ప్రపంచంలోని ఏ దేశ ఒత్తిడికి తలొగ్గదు అనే విషయం మాత్రం వారికి ఇప్పటికే బోధపడి ఉంటుంది.