TS Liquor Tenders :
తెలంగాణలో 2023-25 వార్షిక సంవత్సర కాలానికి మద్యం టెండర్ల ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే పెద్ద సంఖ్యలో వ్యాపారులు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. డిసెంబర్ 1 నుంచి వీరు కొత్త షాపులు ఓపెన్ చేసుకునేందుకు ఎక్సైజ్ శాఖ అనుమతులిచ్చింది. లక్కీ డ్రా ద్వారా ఇప్పటికే యజమానుల ఎంపిక ప్రక్రియ పూర్తయ్యింది. అయితే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి పోటాపోటీ దరఖాస్తులు అందజేశారు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చింది.
అయితే తెలంగాణలో మద్యం టెండర్ల ప్రక్రియలో ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఏపీకి చెందిన ఒక స్థిరాస్థి సంస్థ ఇందులో టెండర్లు వేసినట్లు తెలిసింది. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారా..? సదరు సంస్థ ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 5 వేల దరఖాస్తులు వేసినట్లు ఎక్సైజ్ శాఖ పరిశీలనలో తేలింది. అంటే ఈ లెక్కన రూ. 100 కోట్లను చెల్లించినట్లు సమాచారం. దీంతో అబ్కారీ శాఖ అధికారులు అవాక్కయ్యారు. అయితే సదరు సంస్థ హైదరాబాద్ శివారులోని ప్రాంతాలపై దృష్టి పెట్టినట్లుగా గుర్తించారు.
శంషాబాద్, సరూర్ నగర్ పరిధిలో ఈ టెండర్లు వేసినట్లు గుర్తించారు. ఈ క్రమంలో సదరు సంస్థకు లక్కీ డ్రాలో ఏకంగా 110కి పైగా దుకాణాలు వచ్చినట్లు సమాచారం. ఇందులో మరికొన్ని అప్లికేషన్లు కూడా అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ఏకంగార రూ. 10 లక్షలు అప్పు తీసుకొని టెండర్లు వేసినట్లు సమాచారం. ఇక అనంతపూర్ కు చెందిన వారు మహబూబ్ నగర్లో, పశ్చిమ గోదావరి జిల్లావారు కొత్తగూడెంలో, నెల్లూరుకు చెందిన వారు మంచిర్యాలలో టెండర్ దాఖలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరప్రదేశ్, మహరాష్ర్టలకు చెందిన పలువురు వ్యాపారులు కూడా ఈ టెండర్లలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తెలంగాణలో మద్యం వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నందునే ఇతర ప్రాంతాల వారి దృష్టి పడినట్లు టాక్ వినిపిస్తున్నది. ఏదేమైనా వీరి వల్ల ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వచ్చి చేరింది. అయితే గుడ్ విల్ పై ఆశతో మరికొందరు టెండర్లు వేసినట్లు సమాచారం. బయట నుంచి అప్పు తెచ్చి మరి ఈ టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. వ్యాపారం పై ఎలాంటి అనుభవం లేనివారు కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఏదేమైనా ఈ సారి మద్యం టెండర్ల ప్రక్రియ రసవత్తరంగా సాగింది.