American Youth : ‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని వందేళ్ల కిందటే మన తెలుగు కవి గురజాడ గొంతెత్తి పాడారు. ఒక దేశమంటే అక్కడి మట్టి కాదు.. వనరులు కాదు.. అక్కడుండే మనుషులు.. వారి హక్కులు.. వారి స్వేచ్ఛా స్వాతంత్ర్యం. ఇవన్నీ కాపాడినప్పుడే ఆ దేశ సార్వభౌమత్వం వెల్లివిరుస్తోంది.
ప్రస్తుత ప్రపంచంలో ఓ వైపు రష్యా-ఉక్రెయిన్ వార్, మరోవైపు ఇజ్రాయెల్- హమాస్ వార్.. ఇలా పలుచోట్ల మానవ హక్కుల హననం జరుగుతోంది. పది మంది దోషులను విడిచిపెట్టిన సరే.. ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదన్న న్యాయసూత్రం అమలు కావడం లేదు. ప్రతీ ఒక్కరిలోనూ సోషల్ మీడియా ప్రభావంతో మానవత్వం, కరుణ, సానుభూతిలాంటి పదాలకు అర్థాలు తెలియకుండా పోతున్నాయి. తాము చేసిందే కరెక్ట్.. అన్న భావన ప్రతీ ఒక్కరిలోనూ పెరిగిపోతోంది. శాంతికి స్థానం లేకుండా పోతోంది. సాత్విక ఆలోచన ధోరణి కనమరుగు అయిపోతోంది.
దేశానికి తాము ఏం చేశాం అన్న వారు కాకుండా దేశం తమకు ఏమిచ్చిందనే వారే ఎక్కువ అవుతున్నారు. తమ దేశ రక్షణకు తాము ఏం చేస్తాం.. ప్రపంచ రక్షణకు తాము ఏం చేస్తామోనన్న దానిపై ఓ క్లారిటీ ఉండడం లేదు. కరుణ, కారుణ్యాలు, పోరాట తత్వం మాయమైపోతున్నాయి. పబ్బులు, క్లబ్బులు, మితీమిరిన స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు, విలాస జీవితాలకు అలవాటు పడిపోతున్నారు. ప్రపంచం ఎటుపోతున్నా ఫర్వాలేదు తాము బాగుంటే చాలు.. అనే ధోరణి పెరిగిపోతోంది. ఇది అన్ని దేశాల్లో ఉంది. అలాగే అమెరికాలాంటి ప్రజాస్వామ్య దేశంలో మరింత ఎక్కువైంది.
తాజాగా ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంపై మీరేం పరిష్కారం చెపుతారని అమెరికాలోని 18-24ఏండ్ల మధ్యలో ఉన్న యువతరాన్ని ఓ సర్వే సంస్థ ప్రశ్నించింది. దీనికి 51శాతం మంది ఇజ్రాయిల్ అనే దేశాన్ని ప్రపంచ పటం నుంచి తీసివేస్తే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. 32 శాతం మంది మాత్రం రెండు దేశాలు ఉంటేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు.
దీన్ని బట్టి అమెరికన్ యువతలో ప్రపంచ శాంతి, హక్కులు, దేశ రక్షణ లాంటి విషయాలపై అవగాహన, ఆసక్తి పోయిందని తెలుస్తోంది. విలాసవంత జీవితాలకు ఆలవాటుపడి, తమ వ్యక్తిగత సౌకర్యమే తప్ప మిగతా జనాల గోడు పట్టించుకునే ఆలోచనే వారు చేయడం లేదని సర్వే ద్వారా తెలుస్తోంది. అమెరికన్ యువతలో ఈ పెడధోరణి.. ఆ దేశ భవిష్యత్ కు మంచిది కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.