Dhoni good bye : ఐపీఎల్ 16 వ సీజన్ నేటితో ముగియనుంది. ఆదివారమే ముగియాల్సి ఉన్నా, వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. సోమవారం రిజర్వ్ డే కావడంతో నేటి మ్యా్చ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. గుజరాత్ రాష్ర్టం అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించే ఈ ఫైనల్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. అయితే రిజర్వ్ డే జరిగే మ్యాచ్ పై క్రికెట్ అభిమానుల్లో మరో అనుమానం నెలకొని ఉంది. అది కూడా తమ ఆరాధ్య ఆటగాడు ధోని గురించే..
నేడు జరిగే మ్యాచ్ తర్వాత ధోనీ తన ఐపీఎల్ కెరీర్ కు కూడా వీడ్కోలు పలుకుతాడని అంతా అనుకుంటున్నారు. తన అంతర్జాతీయ కెరీర్ లో కూడా తన చివరి మ్యాచ్ ను ధోని రిజర్వ్ డే నే ఆడాడు. 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా మరుసటి రోజుకు వాయిదా పడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడింది. 2020 అగస్టు 15న ధోనీ అంతర్జాతీయ క్రికెట్ లోని అన్ని ఫార్మాట్ల నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు.
ఇప్పుడు కూడా రిజర్వ్ డే రావడం.. అభిమానుల్లో ఆందోళనకు కారణమవుతున్నది. అంతర్జాతీయ కెరీర్లో 350 మ్యాచ్ సందర్భంగా ధోనీ రిటైర్మెంట్ ప్రకటించగా, ప్రస్తుతం ఐపీఎల్ లో ఇది 250 వ మ్యాచ్. ఇది కూడా ఒక సంకేతమేనని ధోనీ అభిమానులు చెబుతున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్లో సీఎస్కే గెలిస్తే ఐదోసారి జట్టును గెలిపించిన కెప్టెన్ గా రికార్డు సృష్టిస్తాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్ టైటాన్స్ కు కప్పు ఖాయమవుతుంది. మరి ధోనీ లక్కు ఎలా ఉందో మరికొన్ని గంటల్లో తేలనుంది.