మార్చి 3వ తేదీకి —
water problem : ఉభయ తెలుగు రాష్ట్రాలలో 33 డిగ్రీల వేడి, ఆంధ్రాలో 37-38 డిగ్రీల ఉష్ణోగ్రత, తెలంగాణలోని సిద్దిపేట, ములుగు – వనపర్తి జిల్లాల్లో 39 డిగ్రీలు రికార్డు అయింది. రాత్రిపూట కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఎండలు, వడగాల్పులు, ఉక్కపూతతో జనజీవనం అల్లాడిపోతోంది. ఈ అతి ఉష్ణం వల్ల వడదెబ్బ, డయేరియా, టైఫాయిడ్, కామెర్లు సోకే ప్రమాదం ఉండడంతో ఆంధ్రప్రదేశ్ లో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమయ్యింది. ఫ్యామిలీ డాక్టర్, జగనన్న సురక్ష శిబిరాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి సత్వర ఆరోగ్య సహాయానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 55,607 అంగన్వాడీలలో 23 లక్షల మంది చిన్నారులు, 6 లక్షల మంది గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం అందించడానికి ఇటీవల 200 కోట్ల మేర బిల్లులను ఆఘమేఘాల మీద చెల్లించారు. వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్ల సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అలాగే ‘ఆసరా’ పథకంగా 2023-24 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య రాష్ట్రంలోని రకరకాల ప్రభుత్వ ఆసుపత్రులలో 1,85,581 ప్రసవాలు జరగగా ఇప్పటివరకు 1,33,001 మందికి ఆసరా మొత్తాలు అందజేశారు. మిగిలిన 52,580 మందికి ఏర్పాటు చేస్తున్నారు.
ఆరోగ్యం విషయంలో అప్రమత్తమమైన ప్రభుత్వానికి అసలు సమస్య తాగు-సాగు నీటి సమస్య. ఎన్నికల ముంగిట రైతాంగాన్ని సముదాయించడం సాధ్యమయ్యేనా.? విద్యుత్ రూపంలో మరో పెను సవాలు ముంచుకొస్తోంది.
వ్యవసాయ ఆధారిత భారతదేశంలో 70 రకాలకు పైగా పంటల సాగు చేసే వీలున్న 85% క్షేత్రాలలో 20 రకాల పంటలే పండిస్తున్నారు. ఒకప్పుడు పాడి ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసే భారతదేశం ఇప్పుడు లక్షల కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వెచ్చించి దిగుమతి చేసుకుంటోంది.
ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని చూస్తే ఖరీఫ్ సాధారణ విస్తీర్ణం 85.97 లక్షల ఎకరాలు కాగా ఆగస్టు 23 నాటికి 47.9 చేస్తున్న లక్షల ఎకరాలలో పంటలు వేశారు – 38 లక్షలు ఎకరాలు తక్కువ. వరి 3.45 లక్షలు, వేరుశనగ 9 లక్షల ఎకరాలు, పత్తి కూడా 40 శాతం తగ్గింది. ఆంధ్రాలో చెరుకు 2018-19 లో 2,55,000 ఎకరాలలో 90 లక్షల 61 వేల టన్నులు చెరకు క్రషింగ్ జరగగా 2023-24 కి 67,500 ఎకరాలలో 20 లక్షల 61 వేల టన్నులకి దిగజారింది.
రాష్ట్ర వ్యాప్తంగా 8. 55 లక్షల ఎకరాలలో సాగయ్యే మామిడిని పొగమంచు ఉష్ణోగ్రతలు, తామర పురుగు, బూడిద తెగులు, మంచి పురుగు వలన పూత పిందె వరకు రాలేదు, దిగుమతి జారిపోయింది.
ఆంధ్రాలో పొగాకు బ్యారన్లు 10 లక్షలున్నాయి. నవంబర్ తుఫాను వలన 50,000 ఎకరాల పంట పోవడంతో అప్పటికే ఎకరాకి 50,000 ఖర్చుపెట్టిన రైతు దెబ్బతిన్న తోట తీసేసి మళ్లీ నాట్లు వేశారు. ఈ ఏడాది బ్యారన్ కి 10 లక్షల రూపాయల పెట్టుబడి అయింది. 142 మిలియన్ కిలోలకు పంటను అనుమతించారు. పొగాకు కి పంట ఇన్సూరెన్స్ ఉండదు, పొగాకు బోర్డు గాని, కేంద్రం గాని, రాష్ట్ర ప్రభుత్వం గాని రైతుని ఆదుకోలేదు. గిట్టుబాటు ధరపై గంపెడు ఆశ పెట్టుకున్న రైతు బితుకు బితుకుమంటూ రేపటి వైపు చూస్తున్నాడు.
తాగునీరు, సాగునీరు లేక బోర్లు పనిచేయక మోటార్లకు విద్యుత్ అందక రైతు అల్లలాడిపోతున్నాడు. ఉద్యానవన పంటలు నిరాశపరిచాయి. కృష్ణ బేసిన్ ను తాకిన నీటి ఎద్దడి ఎన్టీఆర్, కృష్ణ, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో తాగునీటి ఎద్దడి కలవరపెడుతోంది. ప్రకాశం- పల్నాడు జిల్లాల్లో దాదాపు 200 గ్రామాల్లో నీటి సమస్య, ప్రకాశం- ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో 2.50 లక్షల ఎకరాలలో మిర్చికి సాగునీటి సమస్య ఉంది.
వైయస్సార్ పశు బీమా ప్రీమియం చెల్లింపుల్లో జాప్యం వల్ల 1500 మంది పశుపోషకులకు 4.55 కోట్ల రూపాయల బకాయిలున్నాయి. ఇంటింటికీ తాగునీటిని అందించాలని కేంద్ర ప్రభుత్వం 2019లో ‘జల్ జీవన్ మిషన్’ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 2024 మార్చి నాటికి 64,79,598 కుళాయి కనెక్షన్స్ ఇవ్వాలన్నది లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకూ 38,63,766 కనెక్షన్లు మాత్రమే ఇచ్చారు. ఈ నెల రోజుల కాలంతో రాష్ట్ర సర్కారు పోటీ పడాల్సిందే..!
ఆంధ్రాలో ఖరీఫ్ కరువు – డిసెంబర్ 5 న వచ్చిన మిచౌంగ్ తుఫాను వలన నష్టపోయిన 11 లక్షల మంది రైతులను జగన్మోహన్ రెడ్డే ఆదుకోవాలి. భారతదేశం తన దేశీయ సరుకులో 70 శాతం రోడ్డు మార్గం ద్వారానే రవాణా జరుగుతుంది. మిలియన్ల సంఖ్యలో ఉన్న ఈ ట్రక్కు డ్రైవర్లు రోజుకి 14 గంటలు డ్రైవింగ్ చేయడం వలన వారి ఆరోగ్యం దెబ్బ తినడమే కాక ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయి. ఈ మార్చి నుంచి మండే ఎండలలో డ్రైవర్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనున్నదో చూడాలి..!
ఓ వైపు బండలు పగిలి ఎండలు, మరోవైపు తరిగిన వ్యవసాయ ఉత్పత్తులు – పెరిగిన నిత్యావసరాల ధరలు – తాగు నీటి సమస్యలు – చతికిల పడ్డ రాష్ట్ర ఆదాయం, అద్వాన స్థితిలో రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు. పెరిగిన నిత్యవసరాలకు తగ్గట్టుగా ఇచ్చిన హామీలు అమలు పరుస్తూ జీతాలు పెంచాలని ఉద్యోగులు ధర్నాలు, ఎన్నికల ముంగిట అన్ని వైపుల సమస్యలే..!
జగన్మోహన్ రెడ్డి ఇది ముఖ్యమంత్రి దక్షతకు పెద్ద పరీక్షే..!
– తోటకూర రఘు,
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు