Spanish Traveler : పశ్చిమ బెంగాల్ నుంచి నేపాల్ కు వెళ్తుండగా హన్స్ దిహ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుమ్కాలో గత శుక్రవారం స్పానిష్ మహిళా ట్రావెలర్ పై సామూహిక అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు వ్యక్తుల చేతుల్లో అత్యాచారానికి గురైన 28ఏండ్ల ఈ ట్రావెలర్ సోషల్ మీడియా ఇన్ స్టాగ్రామ్ లో తన కష్టాలను వివరించింది.
మేం ఆస్పత్రిలో ఉన్నాం.. ఏడుగురు వ్యక్తులు నన్ను రేప్ చేశారు. కొట్టారు మరియు దోచుకున్నారు. అయినా చాలా వస్తువులు దోచుకోలేదు.. ఎందుకంటే వారి లక్ష్యం నన్ను రేప్ చేయడమే. మా మెడపై కత్తిపెట్టారు మరియు వారు మమ్ముల్ని చంపబోతున్నారని కూడా చెప్పారు..’’ అని అందులో వెల్లడించింది.
శుక్రవారం రాత్రి తన భాగస్వామితో కలిసి దుమ్కాలో ప్రయాణిస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని వాపోయింది. ఈ దంపతులు తమ బైక్ లపై ప్రపంచ యాత్ర చేస్తున్నారు. తమ బైక్ లను ఆపి కురుమహత్ లో డేరా వేసుకుని ఉండగా ఈ రేప్ జరిగింది. ఈ కేసులో ఇప్పటికే జార్ఖండ్ పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు.
కాగా, ఈ ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా భారత్ లో విదేశీ మహిళల పర్యటనలపై ఆందోళన వ్యక్తం అయ్యింది. అయితే అత్యాచారానికి గురైన స్పానిష్ ట్రావెలర్ మాత్రం ‘‘భారత దేశ ప్రజలు మంచివారు. నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను వాళ్లను నిందించను. నేరస్తులను మాత్రమే నిందిస్తాను’’ అని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఆమె మంచి మనస్సుకు భారతీయ నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెను సానుభూతి ప్రకటిస్తూనే రేప్ చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.