Road Accident : సూర్యాపేట జిల్లా కోదాడలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. కోదాడ పట్టణ పరిధి శ్రీరంగాపురం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిలిపి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారితో సహా ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.