Road Accident in America : అమెరికాలో ఉన్న ప్రవాసులు అక్కడి రోడ్డు యాక్సిడెంట్ లో మరణించడం తరుచూ జరుగూతనే ఉంది. రీసెంట్ గా ఇద్దరు స్టూడెంట్స్ అక్కడ జరిగిన యాక్సిడెంట్ లో కన్ను మూశారు. పిల్లలు ఉన్నతంగా ఎదుగుతారని యూఎస్ పంపిస్తే వారి శవాలు ఇంటికి తిరిగి వస్తే కన్నోళ్లను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు.
శనివారం రాత్రి అమెరికాలోని ఆరిజోనాలోని ఫీనిక్స్లో ఆదివారం (శనివారం రాత్రి) జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. వారి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ పట్టణానికి చెందిన డాక్టర్ స్వాతి-డాక్టర్ నవీన్ దంపతుల కొడుకు నివేశ్(20), జనగామ జిల్లా, స్టేషన్ ఘన్పూర్ మండలంలోని శివునిపల్లికి చెందిన స్వర్ణ కారుడు పార్శి కమల్కుమార్-పద్మ దంపతుల పెద్ద కొడుకు గౌతమ్కుమార్(19) అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు.
శనివారం రోజు రాత్రి వీరిద్దరూ వారి వారి మిత్రులతో కలిసి యూనివర్సిటీ నుంచి కారులో వారుంటున్న ప్రదేశానికి తిరిగి వస్తుండగా వెనక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వెనక సీట్లో కూర్చున్న నివేశ్, గౌతమ్ అక్కడికక్కడే మృతి చెందారు. అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు స్థానిక పోలీసులు ఆదివారం మధ్యాహ్నం మృతుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. గౌతమ్ కుమార్ మృతదేహం స్వగ్రామం చేరుకునేందుకు 2, 3 రోజుల సమయం పడుతుందని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు. నివేశ్ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.