BJP : ఎవరూ ఔనన్నా కాదన్నా..తెలంగాణలో బీజేపీకి మంచి ఆదరణే ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యామ్నాయం తామేనని ప్రచార రణంలోకి దిగిన బీజేపీ.. కర్నాటకలో కాంగ్రెస్ గెలుపు, ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడి మార్పు..తర్వాత రాష్ట్రంలో జరిగిన పరిణామాలు బీజేపీని వెనక్కి నెట్టి దాని స్థానంలోకి కాంగ్రెస్ వచ్చి చేరింది. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ కు తెలంగాణలోని ప్రతీ పల్లెలోనూ బలమైన క్యాడర్ ఉంటుంది. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో మరీ ఎక్కువ. అయినా కూడా బీజేపీ నేతల్లో విభేదాలు, తదితర కారణాలతో మొన్నటి ఎన్నికల్లో వెనకంజ వేసింది. 8 స్థానాలకే పరిమితమైంది. పలుచోట్ల రెండో స్థానంలో నిలిచింది.
తాజాగా ఏబీపీ అనే సంస్థ రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో అంచనా వేసింది. రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో..
కాంగ్రెస్: 9-11
బీఆర్ఎస్: 3-5
బీజేపీ: 3-5
ఇతరులు: 1
సాధిస్తాయని చెప్పింది. అయితే ఆ సర్వే సంస్థ గత ఎన్నికలను బట్టి అంచనా వేసినట్టు కనపడుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల తీర్పు ఒకలా.. లోక్ సభ ఎన్నికల్లో ఒకలా తీర్పు ఇస్తారనేది తెలిసిందే. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 1 సీటు మాత్రమే గెలిచింది. కానీ నాలుగు నెలలకే జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ అంచనా లేకుండా బరిలోకి దిగి ఏకంగా 4 సీట్లను గెలుచుకుంది. అసెంబ్లీ ఎన్నికలకు స్తానిక నేతల సామర్థ్యాన్ని ఓటర్లు అంచనా వేస్తారు. కానీ లోక్ సభ ఎన్నికల్లో కేంద్ర నాయకత్వం ఎలా ఉంది అని ఆలోచిస్తారు. ఈ కోణంలో చూసినట్టైతే రాహుల్ గాంధీ కన్నా నరేంద్ర మోడీ వైపే ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో 4 సీట్లు సంపాదించిన ఆ పార్టీకి దాన్ని డబుల్ డిజిట్ కు తీసుకెళ్లడం పెద్ద కష్టమేమి కాదని అంటున్నారు.
వారు చెప్పినట్టు అంతా ఈజీ ఏం కాకపోవచ్చు. ఎందుకంటే.. వాస్తవానికి ఆ పార్టీ కన్నా బీఆర్ఎస్, కాంగ్రెస్ బలమైన పార్టీలు. వీటికి గ్రామస్థాయి నుంచి పట్టు ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అహంకారపూరిత ధోరణితోనే ఓడిపోయింది తప్పా.. ప్రజల్లో ఆ పార్టీకి ఆదరణ బాగానే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేయడమే దానికి నిదర్శనం. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్న మరో 20మందిని మార్చి ఉంటే ఆ పార్టీకి మంచి ఫలితమే వచ్చేది. అలాగే నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యలను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఆ పార్టీకి పెద్ద దెబ్బే తగిలింది. ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో సత్తా చూపాలనే అనుకుంటుంది. అలాగే కాంగ్రెస్ పార్టీకి అధికారం చేతిలో ఉండడం బోనస్ గా మారే అవకాశం ఉంది. అంటే తెలంగాణలో త్రిముఖ పోరు బలంగా ఉండబోతుందని తెలుస్తోంది.
అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం, గిరిజన వర్సిటీ బిల్లు ఆమోదం, ఎస్సీ వర్గీకరణ, ఇతర హామీల అమలతో బీజేపీ ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంది. ఆ పార్టీ నేతలు తమ విభేదాలను పక్కకు పెట్టి.. క్యాడర్ తో మమేకమై.. ఇప్పటి నుంచే ప్రచార రణంలోకి దూకితే ఆ పార్టీకి మంచి ఫలితాలు రావొచ్చు అనే అంచనా కూడా ఉంది. జాతీయనేతలు మోడీ, అమిత్ షా ప్రచారం కూడా ఆ పార్టీకి మైలేజీ ఇవ్వొచ్చు. దాని ద్వారా గతంలో కన్నా ఎక్కువ సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయి.