Summer Clothes : రోజు రోజుకూ ఎండలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎండ వేడికి తట్టుకోలేక అందరూ ఇబ్బంది ఎదుర్కొంటారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతులు మరింత ఇబ్బంది పడుతుంటారు. కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అధిక వేడి నుంచి ఉపశమనం కలగడమే కాకుండా అనారోగ్యానికి గురికాకుండా ఉంటుందన్నారు.
గతేడాది కంటే ఈ సారి వేసవి తీవ్రత విపరీతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు, ముఖ్యంగా ఆరుబయట పనులకు వెళ్లేవారు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేస్తున్నారు. వేసవిలో సాధ్యమైనంత వరకు నైలాన్, సిఫాన్ దుస్తులు కాకుండా కాటన్ ధరించాలని, వేసుకున్న దుస్తులు కూడా వదులుగా ఉండేలా చూసుకోవాలన్నారు.
ఉదయం, సాయంత్రం వేళ మాత్రమే పనులు చేసుకోవాలని, మధ్యాహ్నం (అంటే ఎండ తీవ్రత సమయంలో) బయటకు వెళ్లకపోవడమే మంచిదని నిపుణులు చెప్తున్నారు. ద్రవ పదార్థాలైన నీరు, పండ్ల రసాలు, చెరుకు రసాలు, తదితరాలను తీసుకోవాలని సూచిస్తున్నారు. ఇందులో నీటితో పాటు నిమ్మ షర్బత్, కొబ్బరి నీరు, మజ్జిగ ఎక్కువగా ఉండాలంటున్నారు. డీహైడ్రేషన్ కు గురవకుండా ద్రవ పదార్థాలు ఉపయోగపడతాయని వెల్లడించారు.
ఇక రాత్రి వేళలో వీలైనంత ఎక్కువ స్వచ్ఛమైన గాలి వీచే ప్రదేశాల్లో నిద్రించడం మంచిందని చెప్తున్నారు. పూర్వం గ్రామాలతో పాటు చాలా వరకు ఆరు బయట స్వచ్ఛమైన గాలిలో నిద్రించే వారు. దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్న ఈ కాలంలో ఇది సాధ్య పడేలా లేదు. కానీ ఇంటి లోపల పైకప్పు లేని ప్రదేశాల్లో మాత్రం ఆరు బయట నిద్రిస్తే మంచిదన్నారు.