Janasena : ఏపీలో ఎన్నికల కాక మొదలైంది. మరో రెండు, మూడు నెలల్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుండడంతో.. అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. వైసీపీలో సీఎం జగన్ సామాజిక లెక్కలు, గెలుపు గుర్రాలు.. పేరిట అభ్యర్థులను మార్చే పనిలో ఉన్నారు. 175 టార్గెట్ తో ఆయన ముందుకెళ్తున్నారు. ఇక టీడీపీ-జనసేన పొత్తుతో ఎలాగైనా వైసీపీని ఓడించి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్నాయి. టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. అయితే జనసేన అభ్యర్థులను పవన్ దాదాపు పూర్తిచేశారని తెలుస్తోంది. ఇందులో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సమాచారం.
ఈరోజు జరిగే యువగళం ముగింపు సభలో టీడీపీ, జనసేన కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 2014 తర్వాత చంద్రబాబు, పవన్ కలిసి ఓకే వేదికపైకి రావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. ఈ సందర్భంగా రెండు పార్టీల శ్రేణులకు పొత్తు అనివార్యత, సీట్ల పంపకం, గెలవాల్సిన ఆవశ్యకత.. వంటి విషయాలపై సూచనలు చేయనున్నారు.
ఇక పొత్తులో భాగంగా జనసేనకు ప్రస్తుతానికి 27 అసెంబ్లీ సీట్లు, 2 లోక్ సభ సీట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్టు తెలుస్తోంది. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అనకాపల్లి, మచిలీపట్నం లోక్ సభ స్థానాలు జనసేనకు దాదాపు ఖాయమైనట్టు తెలుస్తోంది. రాజంపేట సీటుపైన చర్చలు నడుస్తున్నాయి.
జనసేనకు కేటాయించే సీట్లలో అభ్యర్థులను పవన్ ఇప్పటికే ఖరారు చేశారు. వైసీపీ చేస్తున్న మార్పులు, చేర్పులకు అనుగుణంగా కొద్దిపాటి మార్పులు ఉండవచ్చు. జనసేనాని భీమవరం నుంచి పోటీ చేయనున్నారు. తిరుపతిలోనూ పోటీ చేసే అవకాశం కనపడుతోంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఇప్పటి వరకూ ఖరారు చేసిన అభ్యర్థుల్లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందులో నెల్లిమర్ల- లోకం నాగమాధవి, గజపతిపురం- పడాల అరుణ, గాజువాక- సుందరపు సతీశ్, భీమిలి- పంచకర్ల సందీప్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, ఎలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, ముమ్మడివరం- పీతాని బాలకృష్ణ పేర్లు ఖరారైనట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే రాజానగరం- బత్తుల బలరామకృష్ణ, రాజమండ్రి రూరల్- కందుల దుర్గేష్, కాకినాడ రూరల్- పంతం నానాజీ, పిఠాపురం- ఉదయ శ్రీనివాస్, రామచంద్రాపురం- చిక్కం దొరబాబు, జగ్గంపేట- పాలెంశెట్టి సూర్యచంద్రరావు, రాజోలు- డీఎంఆర్ శేఖర్, భీమవరం- పవన్ కల్యాణ్, తణుకు- విడవడ రామచంద్రరావు, తాడేపల్లిగూడెం- బొల్లిశెట్టి శ్రీనివాస్, నరసాపురం- బొమ్మిడి నాయకర్, విజయవాడ వెస్ట్- పోతిన మహేష్, తెనాలి- నాదెండ్ల మనోహర్, గిద్దలూరు- ఆమంచి శ్రీనివాసరావు పేర్లు ఖరారైనట్టు తెలుస్తోంది.
కాగా, ఈ నియోజకవర్గాల్లోని టీడీపీ ఇన్ చార్జులతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. పొత్తును అర్థం చేసుకోవాలని, అధికారంలోకి రావాలంటే త్యాగం చేయకతప్పదని, వారి భవిష్యత్ కు భరోసాగా ఉంటానని హామీ ఇవ్వనున్నారు. ఆ తర్వాత తన అభ్యర్థుల పేర్లను జనసేనాని అధికారికంగా ప్రకటించే అవకాశాలు కనపడుతున్నాయి.