Prabhas Friend : ‘సలార్’లో వరద రాజమన్నార్ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్. ఆయన లీడ్ రోల్ పోషించిన మలయాళ చిత్రం ‘ఆడుజీవితం’. బతుకుదెరువు కోసం కేరళ నుంచి సౌదీకి వెళ్లిన నజీబ్ అనే వ్యక్తి జీవిత కథ ఆధారంగా బ్లెస్సీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో అమలపాల్ హీరోయిన్ గా నటించింది. ‘ది గోట్ లైఫ్’ పేరుతో ఇంగ్లిష్ లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రం ఈనెల 28న థియేటర్లలోకి వస్తోంది. ప్రమోషన్లలో భాగంగా పృథ్వీరాజ్ ఈ మూవీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
తాను ఈ సినిమాలో నజీబ్ అనే బానిస పాత్ర పోషించానని, దాని కోసం ఏకంగా 31 కిలోల బరువు తగ్గానని చెప్పారు. జిమ్ ట్రైనర్, పోషకాహార నిపుణులు, డాక్టర్ల పర్యవేక్షణలో ఇది చేశానన్నారు. వారు తనను విశ్రాంతి తీసుకోమని సూచించేవారు. కానీ కొన్ని సందర్భాల్లో 72 గంటలు షూటింగ్ లో ఉండాల్సి వచ్చేదన్నారు. కరోనా లాక్ డౌన్ తో మూవీ యూనిట్ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలిపారు.
పశ్చిమాసియాలోని జోర్డాన్ ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నప్పుడు లాక్ డౌన్ ప్రకటించారు. మూడు నెలలు జోర్డన్ రాయల్ ఫిల్మ్ కమిషన్ తమను ఆదరించిందన్నారు. ఈ సినిమా కోసం తామందరం చాలా కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. ఈ విషయాలను తెలియజేయడానికి ఇదే సరైన సమయం అనిపించిందని, అందుకే ప్రేక్షకులకు చెబుతున్నానని ఆయన వెల్లడించారు.