Weather Alert: ఈ సంవత్సరం ఎండ తీవ్రత తీవ్రంగా ఉండబోతోందని వాతావరణ విపత్తుల సంస్థ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఏపీలోని రాయలసీమ, కోస్తాంధ్రలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగానే నమోదవుతాయని పేర్కొంది. ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తీవ్రమైన వడగాడ్పులతో వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
పెరిగిన ఊష్ణోగ్రతలు..
తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయి. ఏప్రిల్, మేలో ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. వడగాడ్పుల తీవ్రత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని డిజాస్టర్ మేనేజ్మెంట్ హెచ్చరించింది. ఎల్నినో ప్రభావం ఉండడంతో మార్చిలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలుస్తోంది. హైదరాబాద్లో సాధారణం కంటే రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది. గతేడాది మార్చి మొదటి వారంలో 30 డిగ్రీల ఉంటే.. ఇప్పుడు 35 నుంచి 40 డిగ్రీల వరకు రికార్డ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. ఎల్నినో కారణంగా ఇలా జరుగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. పొరుగున ఉన్న తెలంగాణ లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉండబోతున్నాయిన తెలిపారు.
ఏపీలో మార్చి నుంచే భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగానే నమోదవుతాయని వెల్లడించింది. ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయని తెలిపింది. వడగాల్పులు ఎక్కువగా వీస్తాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వడగాలులు ఎక్కువుండే ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు పంపుతామని అధికారులు నిర్ణయించారు. సమాచారం కోసం టోల్ ఫ్రీ నెం. 1070, 112, 18004250101 ఏర్పాటు చేశారు. కర్నూలు, అనంతపురం, కడప, సత్యసాయి జిల్లాల్లో తీవ్రంగానూ, అల్లూరి, విశాఖ, కోనసీమ, ప్రకాశం, నెల్లూరు, విజయనగరంలో కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
భూ మధ్య రేఖకు ఆనుకొని పసిఫిక్ తీరంలో ఉన్న ఎల్నినో వేసవి చివరి వరకూ కొనసాగుతుంది. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యేకించి మార్చిలో తెలంగాణ, ఏపీ, ఉత్తర కర్ణాటక, ఒడిశా, మహారాష్ట్రలో వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది.