Pawan Kalyan’s Dharmayagam : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. గతంలో మహానాడుతో చంద్రబాబు కొంత హీటెక్కించగా.. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరింత హీటెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల తర్వాత (జూన్ 14వ తేదీ) నుంచి ‘వారాహి యాత్ర’ చేపట్టబోతున్నారు. అయితే ఈ యాత్ర అన్నవరం నుంచి భీమవరం వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి ఈ రోజు (జూన్ 12వ తేదీ) ధర్మయాగం నిర్వహించారు. ఈ యాగం గుంటూరు జిల్లా, మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొనసాగింది. రెండు రోజుల పాటు దీన్ని కొనసాగించనున్నరు పవన్ కళ్యాణ్.
ధర్మ పరిరక్షణ, ప్రజా క్షేమం, దేశాభివృద్ధిని కోరుతూ ఈ యాగం సంకల్పించినట్లు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. గణపతి పూజలో మొదలై అంకురార్పణతో పూర్తవుతుంది. ఉదయం 6.55 గంటలకు పవన్ కళ్యాణ్ సంప్రదాయ దుస్తుల (పట్టు బట్టలు ధరించి)తో యాగశాలకు వచ్చారు. దీక్షలో కూర్చొని భగవంతుడిని ధ్యానించారు. పూజారులు చెప్పినట్లు మంత్రాలను చదువుతూ పిల్లా జెల్లా గొడ్డూ గోదా చల్లగా ఉండాలని వేడుకున్నారు.
ఈ కు సంబంధించి యాగశాలలో ఐదుగురు దేవతలను ప్రతిష్టించారు.
స్థిరత్వం, స్థితప్రజ్ఞత ప్రసాదిత దేవత గణపతి, శత్రు, శత్రుత్వ నిరోధిత దేవత చండీమాత, అష్ట ఐశ్వర్యాలకు అధిపతులు శివ పార్వతులు, ఆయురారోగ్య ప్రధాన సూర్య భగవానుడు, ధార్మిక సమతుల్యత, త్రిస్థితియుక్త కారకుడు శ్రీ మహావిష్ణువు యాగపీఠంపై పరివేష్టితులై ఉండగా యాగం ప్రారంభమైంది. ఈ ఐదుగురు దేవతలకు అభిముఖంగా యంత్ర ప్రతిష్ఠ చేపట్టారు. విగ్రహం, యంత్రం, హోమం ఆలంబనగా ప్రారంభమైన యాగం రేపు కూడా కొనసాగుతుంది.
పార్టీ కార్యాలయంలోని విశాల ప్రాంగణంలో యాగశాల ఏర్పాటు చేశారు నిర్వాహకులు. యాగశాల ఆద్యంతం పరిమళాలను వెదజల్లుతోందని పార్టీ శ్రేణులు తెలిపారు. ఆ ప్రదేశం, ప్రాంతం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఇక్కడ సనాతన ధర్మం పరిఢవిల్లుతోందని, యాగ సంప్రదాయ మేళవింపులో మామిడి తోరణాలు, పూలహారాలు, అరటి చెట్లు, రంగవల్లుల అలంకరణతో శోభాయమానంగా అలరారుతోంది.