Prashant kishor : ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే) రీసెంట్ గా చంద్రబాబును కలిశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు పీకే స్ట్రాటజిస్టుగా పనిచేయబోతున్నాడని వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. అయితే వారద్దరి భేటిలో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు.. ఫలానా అంశాలు చర్చించారు అని ఊహించడమే తప్ప నిజాలు ఏవో ఎవరికీ తెలియదు. అయితే పీకే ఇప్పుడంత పాపులర్ స్ట్రాటజిస్ట్ కూడా ఏమి కాదు.
ప్రస్తుతం దేశంలో స్ట్రాటజిస్టుగా ట్రెండింగ్ లో ఉన్నది సునీల్ కనుగోలు. ఈయన కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ కు స్ట్రాటజిస్టుగా పనిచేసి గెలిపించారు. ఈ సక్సెస్ రేటుతో ఆయనకు హర్యానా, మహారాష్ట్ర అప్పగించారు. అయితే మహారాష్ట్రలో కాంగ్రెస్ ను పైకి లేపడం పెద్ద సవాలే. మరి ఈ టాస్క్ ను కనుగోలు ఎలా డీల్ చేస్తాడో చూడాలి.
ఇక అసలు విషయంలోకి వద్దాం.. పీకే, చంద్రబాబు భేటీ వైసీపీకి మింగుడు పడడం లేదు. ఎందుకంటే పీకేకు చెందిన ఐప్యాక్ సంస్థ జగన్ స్ట్రాటజిస్టుగా ఉంది. అయితే ఆ సంస్థతో పీకే సంబంధాలు తెంచుకున్నాడు. అయినా ఆయన శిష్యులే దాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం జగన్ పార్టీ వ్యవహారాలను రిషిరాజ్ చూస్తున్నాడు. అలాగే చంద్రబాబు సోషల్ మీడియా వ్యవహారాలను రాబిన్ శర్మ చూస్తున్నాడు. ఈయన కూడా పీకేకు పాత శిష్యుడే. ఈయన టీడీపీ సోషల్ మీడియా, సర్వే వంటివి మాత్రమే చూస్తాడు. ఎందుకంటే మిగతా విషయాల్లో చంద్రబాబు తానే ఓ పే..ద్ద స్ట్రాటజిస్టు అని భావిస్తుంటారు.
ఇక పీకే తాను ప్రస్తుతం స్ట్రాటజీల దందా చేయడం లేదట. తానే ఓ రాజకీయ నాయకుడిగా ఎదగాలని బిహార్ లో పాదయాత్ర చేశారు. ఎవరూ పట్టించుకోలేదు. ఆయన రాజకీయ కల అట్టర్ ప్లాప్ అయింది. అంటే స్వీయ వైద్యం పనికిరాదన్న మాట. ఇక పీకే కూడా పెద్ద స్ట్రాటజిస్ట్ ఏం కాదని ఆరోపించేవాళ్లు ఉంటారు. గెలుపు అవకాశం ఉన్న పార్టీలను పట్టుకుని.. వాటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడని అంటారు. గతంలో వైసీపీ, డీఎంకే, మమత పార్టీ, బీజేపీ.. ఇలా ఎన్నో ఉదాహరణలు చెప్పవచ్చు అని అంటున్నారు.
పీకే ఆ మధ్య కేసీఆర్ తోనూ భేటీ అయ్యాడు. కొంతకాలం పనిచేశాడు కూడా. సర్వేలు, ఫీల్డ్ లెవల్ అధ్యయనాలతో హల్ చల్ చేశాడు. కానీ ఎందుకో కేసీఆర్ అతన్ని తరిమేశాడు. కేసీఆర్, చంద్రబాబు.. వేరే ఎవరో ఇచ్చే సలహాలు పాటించరు కదా.. వాళ్లే పెద్ద చాణక్యులు కదా.
అయితే చంద్రబాబుతో పీకే భేటీ స్ట్రాటజీల కోసం కాదని తెలుస్తోంది. మరి దేనికి అని అంతట చర్చ నడుస్తోంది. అది పార్టీల నడుమ సాగే అంతరంగిక బేరాలు, సంప్రదింపుల యవ్వారం అని అంటున్నారు. అదే నిజం అనుకుంటే చంద్రబాబుతో బీజేపీకి సఖ్యత లేదు. అలాగని ఇండియా కూటమితోనూ బాగాలేడు. మరెవరి కోసం పీకే చంద్రబాబుతో సంప్రదింపులు జరిపాడు అన్నదే పెద్ద ప్రశ్న. దీనికి మరికొన్ని రోజుల్లోనే క్లారిటీ తప్పక వస్తుంది.