Producer Dil Raju : మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు ముగించుకుని.. మరో మూడు, నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలకు రాజకీయ పార్టీలు రెడీ కాబోతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని తహతహలాడుతోంది. 17 సీట్లు సాధించి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది. పక్కా ప్రణాళికతో , ఆరు గ్యారెంటీల హామీతో, నిరుద్యోగులు, ఉద్యోగుల సహకారంతో అధికార బీఆర్ఎస్ ను కంగుతినిపించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్.. లోక్ సభ ఎన్నికల్లోనూ పక్కా స్ట్రాటజీని అమలు చేయాలని చూస్తున్నది.
ఈమేరకు సంక్రాంతి నాటికే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది. ఇప్పటికే లోక్ సభ నియోజకవర్గాల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. కాంగ్రెస్ అధికారంలో ఉండడడంతో ఎంపీ సీట్లకు గిరాకీ పెరిగింది. ఆశావహుల సంఖ్య భారీగా పెరుగుతోంది. పలువురు కొత్తవారు బరిలో ఉండడానికి మొగ్గు చూపుతున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా ఎన్నికల బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రత్యర్థుల కంటే ముందే..
అధికార కాంగ్రెస్ కు లోక్ సభ స్థాయిలో ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ ఎన్నికలు ఓ రకంగా రాహుల్ నాయకత్వానికి విషమ పరీక్ష అని చెప్పాలి. అలాంటి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ తనవంతుగా కేంద్ర కాంగ్రెస్ కు చేయూతనివ్వాలని చూస్తోంది. అందుకే ఎంపీగా పలువురు ప్రముఖులకు చోటివ్వాలని చూస్తోంది. ఈక్రమంలో దిల్ రాజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ ఎంపీగా బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈమేరకు ఆయన సంప్రదింపులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. దిల్ రాజ్ .. రేవంత్ రెడ్డికి కూడా సన్నిహితుడే. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు కూడా జరిగినట్లు చెపుతున్నారు. నిజామాబాద్ నుంచి వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కవిత, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలో ఉండనున్నారు. దీంతో ముక్కోణ పోటీ గట్టిగానే ఉండబోతోంది.
ఆశావహుల సంఖ్య ఎక్కువే..
నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి కాంగ్రెస్ నుంచి ఆశావహుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. బాల్కొండ నుంచి స్వల్ప తేడాతో ఓడిపోయిన ముత్యాల సునీల్ రెడ్డి, మైనారిటీ కోటాలో పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ , మరికొందరు ఈ స్థానంపై ఆశలు పెంచుకున్నారు.
సీఎం రేవంత్ నిర్ణయమే..
గట్టిపోటీ ఉండే సీటు కావడంతో నిజామాబాద్ పై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. అయితే దిల్ రాజుకు ఇది సొంత జిల్లా. మోపాల్ మండలం నర్సింగ్ పల్లి ఆయన ఊరు. దీంతో ఆయన పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సామాజిక లెక్కలను పరిగణలోకి తీసుకుంటే అనిల్ కు సీటు ఇవ్వడం ద్వారా.. బీసీల ఓట్లతో పాటు అనిల్ సామాజికవర్గమైన పద్మశాలీ ఓట్లు కాంగ్రెస్ కు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే ముస్లింల ఓట్లు కూడా కాంగ్రెస్ పడడం అదనపు బోనస్. దిల్ రాజు పోటీలో ఉంటే బిగ్ షాట్ పోటీలో ఉండడంతో పాటు ఆయనకున్న క్రేజ్ కూడా కలిసివస్తుంది.
దిల్ రాజు కూడా కింది స్థాయి నుంచి టాలీవుడ్ లోనే ప్రముఖ నిర్మాతగా మారాడు. వాస్తవానికి తెలంగాణ నుంచి ఉన్న ప్రముఖ నిర్మాత ఆయనే. సినిమాలను శాసిస్తున్న అతికొద్ది మందిలో ఆయన అగ్రగణ్యుడనే చెప్పాలి. సీఎం రేవంత్ కూడా ఈవిషయంలో పాజిటివ్ గానే ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఆయన నిర్ణయం తీసుకుంటే అధిష్ఠానాన్ని ఒప్పింగలరు.. అలాగే ఇతర ఆశావహులకు సర్దిచెప్పగలరు. మరి ఇవన్నీ దిల్ రాజుకు కలిసివస్తాయా? లేదో? మరికొద్ది రోజుల్లోనే డిసైడ్ కానుంది.