Vinukonda MLA : మరో రెండు నెలల్లో ఎన్నికల జరుగబోతుండగా ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ ఇప్పటికే నాలుగు జాబితాలు ప్రకటించింది. నోటిఫికేషన్ నాటికి మొత్తం అభ్యర్థులను ప్రకటించే విధంగా సీఎం జగన్ ముందుకెళ్తున్నారు. ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈక్రమంలో ఇతర పార్టీల నుంచి నాయకులు వైసీపీలో చేరుతున్నారు.
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని నూజండ్ల మండలం మారెళ్లవారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బత్తుల వెంకటేశ్, బత్తుల రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి ప్రత్యర్థి పార్టీలు వణికిపోతున్నాయన్నారు. వినుకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెసు పార్టీ లోకి చేరడం సంతోషకరమన్నారు. ఎన్నికల నాటికి టీడీపీ నుంచి మరింత మంది పార్టీలో చేరబోతున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో రెండో సారి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పినట్టుగా 175 సీట్లు వైసీపే గెలుస్తుందన్నారు. జగన్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ.. ఎన్నికల సమరశంఖం కూడా పూరించారన్నారు. సిద్ధం సభతో ప్రతిపక్షాల నోళ్లు మూతపడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు పాల్గొన్నారు.