Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తానే అని బరిలోకి దిగిన బీజేపీ 8 సీట్ల దగ్గరే ఆగిపోయింది. బండి సంజయ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, అర్వింద్.. వంటి ప్రముఖులు ఓడిపోవడం ఆ పార్టీని నైరాశ్యంలో ముంచింది. కేంద్రంలో మోడీ హవా నడుస్తున్నా తెలంగాణలో పార్టీ మూడో స్థానానికి పడిపోవడం వారిని షాక్ కు గురి చేసింది.
తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని.. రాష్ట్రంలో కీలక సమస్యల్లో ఒకటైన ఎస్సీ వర్గీకరణ, రాష్ట్ర పునర్విభజన చట్టంలోని ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు..వంటివి అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందే ఎస్సీ వర్గీకరణకు ఒక ఉన్నతస్థాయి కమిటీని కూడా వేసింది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతో కలిసి ఎన్నికల సభలు, ప్రచారం సైతం చేయించారు. మాదిగలకు తమ పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోందని చెప్పుకోవడానికి చేయాల్సిందంతా చేశారు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. కాకపోతే గతంలో కంటే కొన్ని సీట్లు, ఓట్ల శాతం మాత్రం పెంచుకోగలిగింది. ఇక ఇటీవలే ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంట్ ఆమోదం కూడా తెలిపింది.
మరో మూడు నెలల్లో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలు వాటిపై దృష్టిసారించాయి. కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో.. ఆ పార్టీ 17 సీట్లు గెలవాలని తహతహలాడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వేవ్ నడిచిందని, ఆ వేవ్ లోక్ సభ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ కూడా లోక్ సభ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. మెదక్ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ దొంగ హామీలిచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని ఆ పార్టీ ఆరోపిస్తూ లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఇక బీజేపీ కేంద్రంలో హ్యాట్రిక్ కొడుతామన్న భరోసాలో ఉంది. ఆ మేరకు తెలంగాణలో సత్తా చాటాలని అనుకుంటోంది. ఇప్పటినుంచే ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది.
ఈక్రమంలో వరంగల్ ఎంపీ(ఎస్సీ) స్థానం నుంచి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను పోటీ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీ వర్గీకరణ తమతోనే సాధ్యమని.. ఆ వర్గాలకు భరోసా కల్పించే ప్రయత్నంగా కమిటీ కూడా వేసిన విషయం తెలిసిందే. కృష్ణ మాదిగ కూడా వరంగల్ కు స్థానికుడు కావడం లాభిస్తుందని పార్టీ అభిప్రాయపడుతోంది. తద్వారా తెలంగాణలో భారీగా ఉన్న మాదిగల ఓట్లను తమ వైపుకు ఆకర్షించవచ్చని అంచనా వేస్తోంది.
ప్రస్తుతం వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ నాయకుడు పసునూరి దయాకర్ ఉన్నారు. హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ కు ఆయన చేసిందేమి లేదని టాక్ ఉంది. అసలు ఎంపీ ఉన్నారా? లేడా? అని జనం ఆరోపిస్తారు కూడా. అయితే ఈ సారి సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థులను మారుస్తారు అనే ప్రచారం నడుస్తోంది. అలాగే కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థిని రంగంలోకి దించాలని భావిస్తోంది.
ముక్కోణ పోటీలో గెలవాలంటే అన్ని పార్టీలు గెలుపు గుర్రాలనే బరిలోకి దింపడానికి ప్రయత్నిస్తున్నాయి. ఆ కోణంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమనేతనే పోటీలోకి దించి గెలుపు బావుటా ఎగురవేయాలని బీజేపీ ఆలోచిస్తోంది. అయితే మంద కృష్ణ మాదిగ ఎంతమేరకు ప్రభావం చూపుతారో ఎన్నికల తర్వాతనే తెలియనుంది. నిజానికి కృష్ణ మాదిగ పొలిటికల్ ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. గతంలో పోటీ చేసినా ఏ ఎన్నికల్లోనూ ఆయన గెలవలేదనే విషయం ఆ పార్టీ గుర్తుంచుకోవాలి.