- చంద్రబాబుతో కలయికతో ఏం చెప్పదల్చుకున్నారు..?
Janasenas Mind : జనసేనాని పవన్ కల్యాణ్ తనదైన శైలిలో రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. 2019 పరాభావాన్ని ఒక పాఠంగా మార్చుకొని పవన్ ఈసారి రాజకీయ అడుగులు వేస్తున్నారా..? ఎలాగైనా ఈ సారీ పార్టీకి పెద్ద సంఖ్యలో సీట్లు సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారా.. వైసీపీ అంటేనే ఒంటి కాలు మీద లేచే పవన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో మాత్రం ముందునుంచే సయోధ్యనే కోరుకుంటున్నారు. బీజేపీతో కలిసి సాగుతున్నా బాబుతో మాత్రం దోస్తీ వదులుకోవడం లేదు. ఇప్పటికే చంద్రబాబును రెండుసార్లు జనసేనాని ఇంటికి వెళ్లి మరి కలువడం ఇదే తెలియజేస్తున్నది.
గతంలోనూ ఇదే దోస్తాన్..
2014 ఎన్నికలకు ముందు కూడా పవన్ టీడీపీ అధినేత చంద్రబాబుతో దోస్తీనే కొనసాగించారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా వెనక్కి తగ్గారు. చంద్రబాబు అధికారంలోకి రావాలనే తలంపుతో ఆయన మిన్నుకుండి పోయారని వైసీపీ శ్రేణులు ఇప్పటికి ఆరోపిస్తూనే ఉంటాయి. 2019 ఎన్నికల్లో మాత్రం టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వైసీపీ కి మళ్లకుండా జనసేనాని పోటీలోకి అభ్యర్థులను దింపారని ప్రత్యర్థి శిబిరం ఆరోపించింది. ఈ క్రమంలోనే పవన్ ను చంద్రబాబు దత్త పుత్రుడు అంటూ స్వయంగా సీఎం జగనే పలు వేదికలపై ఆరోపించారు. ఈ సారి కూడా వారు కలుస్తారని టీడీపీ, జనసేన కంటే వైసీపీ శిబిరమే ముందుండి ప్రకటనలు గుప్పిస్తున్నది.
మరి జనసేనాని ఎవరివైపు..?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో పెద్ద క్రేజ్ ఉంది. ఆయన శైలి చాలా మందికి నచ్చుతుంది. ఈ క్రమంలో ఈ అభిమానాన్ని ఓటు బ్యాంకుకు మల్చుకోవడంలో మాత్రం పవన్ ఫెయిలయ్యారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై మొదటి నుంచి ఆయన గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో ఈసారి ఆ పార్టీ గట్టి జవాబు ఇయ్యాలనే భావనతో ముందుకెళ్తున్నట్లుగా కనిపిస్తున్నది. తన వ్యక్తిగత జీవితంపై స్వయంగా ఆ పార్టీ అధినేతే విమర్శలు చేయడం జనసేనాని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి చంద్రబాబుతో సఖ్యత కోరుకుంటున్నారు. ఈ సారి టీడీపీతో కలిసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాలని భావిస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి చర్చలు జరిపారు.
చంద్రబాబు కూడా పవన్ ను కలిసి చర్చలు జరిపారు. భవిష్యత్ లో ఎలా ముందుకెళ్లాలో తమకంటూ కొన్ని ప్రణాళికలు ఉన్నాయని ఇద్దరు నేతలు మీడియాకు చెప్పుకొచ్చారు. వైసీపీ ఎదురుదాడిని అడ్డుకోవాలంటే కలిసి వెళ్లడమే మంచిదనే అభిప్రాయంలో ఇద్దరు నేతలు కనిపిస్తున్నారు. కాగా, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయోనని ఒక అంచనా వేసుకుంటున్నారు. త్యాగాలు చేయాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందని కూడా ఆరా తీస్తున్నారు. క్యాడర్ కు అన్యాయం జరగకుండా ఇద్దరం కలిసి ముందుకెళ్తామని ప్రకటనలు బయటకు వస్తున్నా భవిష్యత్ లో ఇది ఎలా ఉంటుందో రానున్న కాలమే నిర్ణయిస్తుంది. ఏదేమైనా జనసేనాని పవన్, టీడీపీ అధినేత చంద్రబాబు మిత్రుత్వం కొనసాగించేందుకే మొగ్గు చూపుతున్నారని ఆయన అడుగులను బట్టి తెలుస్తున్నది.