Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ ప్లేసులో హార్దిక్ పాండ్యా నియామకంపై క్రికెట్ రంగంలో ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. కొంత మంది అనుకూలంగా, మరికొందరు ప్రతికూలంగా స్పందిస్తూనే ఉన్నారు. రోహిత్ ఫ్యాన్స్ ఆగ్రహ సెగ ముంబై ఇండియన్స్ కు ఇంకా తగులుతూనే ఉంది. ఇప్పటికే ఆ జట్టు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి రోహిత్ సేన అన్ ఫాలో అవుతూనే ఉంది. గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ కోసం రోహిత్ ను తప్పించడం సరికాదనే భావన వారిలో ప్రబలంగా ఉంది. ఈక్రమంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ విషయంలో భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా..‘‘ఆకాశ్’’ వాణి పేరిట సంచలన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ టైటాన్స్ ను ఒకసారి చాంపియన్ గా, మరొకసారి రన్నరప్ గా నిలిపిన పాండ్యా కెప్టెన్సీ ఇంకా పూర్తి స్థాయిలో లేదని ఆయన కామెంట్స్ చేశారు.
‘‘బయట నాకు వినిపించినవి.. అలాగే నా అంచనా ప్రకారం.. ముంబై కెప్టెన్ గా ఎంపిక చేస్తామంటేనే పాండ్యా గుజరాత్ ను వదిలాడు. ఇది రోహిత్ శర్మకు కూడా తెలిసే ఉంటుంది.. తమ భవిష్యత్ కోసం యువ నాయకత్వాన్ని ముంబై కోరుకోవచ్చు. అయితే గుజరాత్ జట్టు రాణించడంలో నెహ్రా కీలకపాత్ర పోషించాడు. ఇక ముంబై కూడా చేయాల్సింది అదే. పాండ్యా కు వివిధ స్థాయిల్లో సహకరించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది. ఎందుకంటే హార్దిక్ ఇంకా.. పరిపూర్ణ కెప్టెన్ గా మారలేదని నా అభిప్రాయం.’’ అని ఆకాశ్ కుండబద్దలు కొట్టినట్టు వ్యాఖ్యానించారు.
అలాగే రోహిత్ శర్మ గురించి స్పందిస్తూ..‘‘ రోహిత్.. దిగ్గజ క్రికెటర్.. కెప్టెన్ . ఐపీఎల్ దాదాపు పదేళ్ల పాటు ముంబైని నడిపించాడు. ఐదు టైటిళ్లను అందించాడు. అయితే ఏదో ఒక దశలో భవిష్యత్ గురించి ఆలోచించాల్సి అవసరముంటుంది. గత రెండేళ్లలో ముంబై ప్రదర్శన అంతగా ఆకట్టుకోవడం లేదు. అందుకే మరొకరికి చాన్స్ ఇవ్వాలని ముంబై ఓనర్స్ భావించవచ్చు. అయితే రోహితే స్వయంగా కెప్టెన్సీ విషయంపై నిర్ణయం తీసుకుని ప్రకటిస్తే..ఇంతటి రగడ జరిగి ఉండేది కాదు..’’ అని పేర్కొన్నాడు.
అయితే.. ఆకాశ్ చెప్పినట్టుగా.. హార్దిక్ పర్ఫెక్ట్ కెప్టెన్ కావాలంటే కొంత సమయం పట్టవచ్చు. అతడు రోహిత్ ను మరిపించేలా జట్టును నడిపించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తన సహచరులు, జట్టు యాజమాన్యం, కోచ్ ల సహకారంతో జట్టును రాబోయే ఐపీఎల్ లో మెరుగైన స్థానానికి తీసుకెళ్తే హార్దిక్ కెప్టెన్సీపై వివాదాలు తగ్గొచ్చు.