New Jersey : హైదరాబాద్ కు చెందిన బిందు ప్రియ అనే గృహిణి న్యూజెర్సీలో ప్రసవ సమయంలో మృతి చెందింది. ఆమె ఆకస్మిక మరణం తర్వాత, ఆమె మృతదేహాన్ని భారత్ కు తీసుకువచ్చేందుకు ఆమె భర్త ‘గోఫండ్ మీ’ పేజీని ప్రారంభించాడు. మార్చి 29న బిందుప్రియ ప్రసవ సమయంలో కన్నుమూసినట్లు ఆమె భర్త అంజనీ శ్రీఖర్ బండ్ల తెలిపారు. ఆమె మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి, అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడానికి ఆమె భర్త క్రౌడ్ ఫండింగ్ పేజీని ప్రారంభించారు.
‘దేవుడు ఒక బహుమతి ఇచ్చాడు మరియు ఒక జీవితాన్ని తీసుకున్నాడు’ అని ఆమె భర్త గోఫండ్ మీ పేజీలో రాశారు.
‘హాయ్ నా పేరు శ్రీఖర్, నిన్న అనుకోకుండా నా భార్య ప్రసవంలో చనిపోయింది. ఆమె మృతదేహాన్ని భారత్ కు తరలించాలి. ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాం. థాంక్యూ వెరీ మచ్’ అని శ్రీఖర్ ఆ పేజీలో రాసుకున్నాడు.
ఏప్రిల్ 1 నాటికి శ్రీఖర్ గోఫండ్ మీ పేజీ తన భార్య అంత్యక్రియల కోసం దాదాపు 40,000 డాలర్లు సేకరించింది. కాగా, ఆయన 60,000 డాలర్లు సమకూరాలని ఆయన కోరుకుంటున్నాడు.
అమెరికాలోని భారతీయ కమ్యూనిటీకి చెందిన పలువురు సభ్యులు, ‘గోఫండ్ మీ’ పేజీని చూసిన వారు శ్రీఖర్ కు, వారి నవజాత శిశువుకు సంతాపం తెలిపారు. బిందు మరణానికి దారితీసిన ఖచ్చితమైన కారణం వెల్లడించలేదు.
అమెరికాలో పెరుగుతున్న ప్రసవ మరణాలు..
ఆగస్టు, 2023 నుంచి ఒక అధ్యయనం ప్రకారం, 1999, 2019 మధ్య గర్భం ప్రసవానికి సంబంధించిన మరణాలు రెట్టింపయ్యాయి. జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, ‘1999 నుంచి 2019 వరకు ప్రతీ జాతి, సమూహానికి ప్రసూతి మరణాల రేటు రెట్టింపు కంటే ఎక్కువ.’ దీంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.