YS Sharmila : ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్డీఏ కూటమి వర్సెస్ వైసీపీగా మారిన పోరులో కాంగ్రెస్ కూటమి కూడా సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టిన తర్వాత దూకుడు పెంచారు. ప్రతిపక్షాలను కార్నర్ చేస్తూనే అన్న జగన్ పై విరుచుకుపడుతుండడంతో రాజకీయంగా వేడి రాజుకుంటోంది. వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ ఏపీలో సంక్షేమ ఓటు బ్యాంక్ పై గురిపెట్టింది. ఈమేరకు కీలక నిర్ణయాలను ప్రకటించింది.
కాంగ్రెస్ పార్టీ కర్నాటక, తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఆ పార్టీ ప్రకటించిన గ్యారెంటీలు కీలకంగా పనిచేశాయి. ఇదే సమయంలో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అస్త్రంగానే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగింది. జగన్ కు పోటీగా చంద్రబాబు సైతం సూపర్ సిక్స్ పేరుతో సంక్షేమ వరాలు ప్రకటించారు. ఇక కాంగ్రెస్ ఏకంగా 9 గ్యారెంటీలతో ఎన్నికల బరిలో దిగుతోంది. ఆ గ్యారెంటీలు ఏంటో ఒక సారి చూద్దాం..
తొలి గ్యారెంటీ:
రాష్ట్రానికి 10ఏండ్లు ప్రత్యేక హోదా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు.
రెండో గ్యారెంటీ:
మహిళా మహాలక్ష్మి: ప్రతీ పేద మహిళకు ప్రతీ నెల రూ. 8,500 నగదు. ఏడాదికి లక్ష రూపాయలు అవుతుంది.
మూడో గ్యారెంటీ:
రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ.
నాలుగో గ్యారెంటీ:
పెట్టుబడి మీద 50శాతం లాభంతో కొత్త మద్దతు ధర.
ఐదో గ్యారెంటీ:
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు కనీస వేతనం రూ.400 చేస్తామని పార్టీ హామీగా ప్రకటించింది.
ఆరో గ్యారెంటీ:
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య.
ఏడో గ్యారెంటీ:
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ. మొట్టమొదటి సంతకం ఉద్యోగాల భర్తీ మీదే.
ఎనిమిదో గ్యారెంటీ:
ఇల్లు లేని ప్రతీ పేద కుటుంబానికి మహిళ పేరు మీద రూ.5లక్షలతో పక్కా ఇల్లు అందిస్తారు.
తొమ్మిదో గ్యారెంటీ:
ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ పెన్షన్. అర్హులైన ప్రతీ ఒక్కరికి 4వేల పింఛన్, దివ్యాంగులకు రూ.6వేల పింఛన్.
కాగా, ఏప్రిల్ 1న కాంగ్రెస్ కూటమి తమ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తోంది. అదే విధంగా వచ్చే వారం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని నిర్ణయించారు. షర్మిల తన ప్రచారంలో ఎవరిని టార్గెట్ చేస్తారు..కాంగ్రెస్ గ్యారెంటీలు ఏ పార్టీపై ప్రభావం చూపిస్తాయనేది ఆసక్తికరంగా మారబోతోంది.