మస్క్ ట్విట్టర్ ఓనరైన తర్వాత దాన్ని ఒక పట్టాన ఉండనివ్వడం లేదు. ఎప్పుడు ట్విట్టర్లో మార్పులు, చేర్పులు చేస్తున్నానంటూ..ఏదో ఒకటి గెలికి పారేస్తున్నారు. మొన్నటి వరకు బ్లూ టిక్ పంచాయితీని నడిపించారు. వీఐపీలైన సరే పుక్కెడుకు బ్లూ టికెట్ వాడుకునేదే లేదని తేల్చి చెప్పారు. బ్లూ టిక్ కావాలంటే రొక్కం చెల్లించాల్సిందేనని తెగేసి చెప్పారు. మస్క్ పోరు భరించలేక కొంత వీఐపీలు ట్విట్టర్ ఖాతాలను కూడా క్లోజ్ చేసుకున్నారు.
ఇక ఇంతటితో ఆగని మస్క్..కొన్ని రోజుల పాటు ట్విట్టర్ ఉద్యోగులపై పడ్డారు. ఆఫీస్ పనివేళలను సరిగ్గా పాటించని ఎంప్లాయిస్ జీతాల్లో కోత తప్పదని హెచ్చరించారు. కొంత మంది ఉద్యోగులను సంస్థ నుంచి తొలగించారు కూడా. దీంతో మస్క్ శాడిజంపై పలువురు ఎంప్లాయిస్ తిట్టిపోశారు. ఇదేం తిక్క పనులంటూ మండిపడ్డారు.
మరోవైపు ఈ సంఘటనలు మరవక ముందే తెరపైకి మరో అంశాన్ని తీసుకువచ్చారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రతీ ఏటా రూ.8.2 కోట్ల సంపాదననే టార్గెట్గా పెట్టుకున్నారు. యూజర్లు ట్విట్టర్ను ఉపయోగించు కొని డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నారు. ఈ విషయంలో యూజర్లు తమకు పూర్తి స్థాయిలో సహకరిస్తారని ఆశీస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు. వెరసి ట్విట్టర్ ద్వారా మనీని రాబట్టుకోవడమే మస్క్ మెయిన్ టార్గెట్గా పెట్టుకున్నట్లు అర్థమవుతోంది. మొత్తంగా ధనం జగత్ ఇదం మూలం అన్న సూక్తిని మస్క్ బాగానే వంటపట్టించుకున్నట్లు అర్థమవుతోంది.