Legislature: కొంత కాలం నుంచి న్యాయ వ్యవస్థ, చట్టసభల మధ్య ఘర్షణ నెలకొంటూ వస్తుంది. చట్టాల రూపకల్పనలో చట్ట సభలు మరింత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని న్యాయ వ్యవస్థ సూచిస్తే.. లోతుంగా పరిశీలించాకే చట్టం చేశామని చట్ట సభలు చెప్తున్నాయి. ఏది ఏమైనా రెండింటి మధ్య కొంత ఘర్షణ మాత్రం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ నాయకుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు కొంత ప్రాచుర్యం సంపదించుకున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో నేషనల్ లెజిస్టేటర్స్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. చట్టాలను రూపొందించడంలో చట్ట సభల ఆదిపత్యం ఉండాల్సిందేనని ఆయన సమర్థించారు. అయితే కార్యనిర్వహక, శాసనసభ (పార్లమెంట్, అసెంబ్లీలు), న్యాయ వ్యవస్థకు సంబంధించిన పాత్రలను రాజ్యాంగం స్పష్టంగా తెలియజేసిందన్నారు. ఎవరూ కూడా తాము అత్యున్నతమని (సుప్రీమ్) భావించి వారి పరిధులను దాటవద్దన్నారు. చట్టాలు చేసే అధికారం ఒక్క శాసన సభలకు మాత్రమే ఉంటుందని, అయితే అవి కూడా రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలన్నారు. చట్ట సభలు చేసిన చట్టం రాజ్యాంగ స్ఫూర్తి, నిబంధనలకు లోబడి ఉందా అనే విషయలను న్యాయ వ్యవస్థ పరిశీలిస్తుందన్నారు. న్యాయ వ్యవస్థలు చట్టాలు చేయలేవని ఆయన చెప్పారు. చట్ట సభలు చేసిన చట్టంలో ఏమైనా లోటు పాట్లు ఉంటే న్యాయ వ్యవస్థను సంప్రదించవచ్చని ఆయన స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థ ఎప్పుడూ డైనమిక్ గా ఉండాలని వెంకయ్య నాయుడు అన్నారు. వీలైనంత త్వరగా న్యాయం అందించేలా చూడాలని చెప్పారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ ఎంపిక విషయంలో పార్లమెంట్ చట్టం చేసేంత వరకు త్రి సభ్య కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో రాజ్యాంగబద్ధంగా అధికారాల విభజనపై వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో మాజీ ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలు, పార్లమెంట్ లో పదే పదే అంతరాయాలు ఏర్పడడంపై వెంకయ్య నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు ప్రవర్తనా నియమావళిని రూపొందించాలని, శాసన సభల్లో, పార్లమెంట్ లో పేపర్లు చింపడం, మైకులు విరగొట్ట కుండా చూడాలన్నారు. సభల్లో వ్యతిరేకత, విభేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండవద్దని తాను చెప్పడం లేదని, వాస్తవానికి నిరసనలు, భిన్నాభిప్రాయాలు, చర్చలు ప్రజాస్వామ్యం మరింత పరిఢవిల్లేందుకు దోహదం చేస్తాయని ఆయన తెలిపారు. కానీ పార్లమెంటేరియన్ గా గౌరవ ప్రదంగా మెలగాలని సూచించారు.