మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కానున్నాడా ? అంటే అవుననే అంటున్నాయి సీబీఐ వర్గాలు. వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నది కడప ఎంపీ అవినాష్ రెడ్డి కావడం గమనార్హం. కడప ఎంపీ స్థానం కోసమే రాజకీయ హత్య జరిగినట్లు పుంకానుపుంకాలుగా కథనాలు వెలువడ్డాయి. అంతేకాదు పులివెందులలో అలాగే కడపలో వివేకా హత్య కేసు బహిరంగ రహస్యమే అనే మాట వినబడుతోంది. వివేకా ఎందుకు హత్య చేయబడ్డాడు ? ఎవరు హత్య చేశారు? హత్య చేయించింది ఎవరు ? అనే విషయాలు ఆ జిల్లాలో అందరికీ తెలిసిన విషయమే అని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని పలుమార్లు సీబీఐ విచారించింది. సీబీఐ అరెస్టు చేసే అవకాశం ఉండటంతో తెలంగాణ హైకోర్టును కూడా ఆశ్రయించాడు అవినాష్ రెడ్డి. వాదోపవాదాలు విన్న తరువాత , కేసు పూర్వపరాలను పరిశీలించిన మీదట సీబీఐని అరెస్ట్ చేయొద్దంటు ఆదేశించలేమని ఎంపీ అవినాష్ రెడ్డికి స్పష్టం చేసింది. తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అవ్వడం ఖాయమని అనుకున్నారు.
కాకపోతే మూడు వారాలకు పైగా సమయం పట్టడంతో ఇక ఇప్పట్లో అరెస్ట్ ఉండకపోవచ్చు అని అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఈరోజు ఉదయం పులివెందులలో అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ఇక అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం ఖాయమని పెద్ద ఎత్తున ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అవినాష్ రెడ్డి హైదరాబాద్ లో తన ఇంట్లో ఉన్నాడు.