DK meet Sharmila : తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అస్ర్తశస్ర్తాలు సిద్దం చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మాత్రమే గట్టి పోటీ నివ్వగలదని అంతా భావిస్తున్నారు. ఏకంగా ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ కూడా ధ్రువీకరించారు. తమకు పోటీ కేవలం కాంగ్రెస్ తో మాత్రమేనని, బీజేపీకి అంత సీన్ లేదని చెప్పుకొచ్చారు.
అయితే కర్ణాటకలో ఘన విజయం తర్వాత కాంగ్రెస్ అధిష్టానం దృష్టి ఇక గెలిచే హోప్ ఉన్న తెలంగాణపై పడింది. తెలంగాణలో పాగా వేస్తే ఇక తమకు తిరుగుండదని భావిస్తున్నది. పార్టీలో సీనియర్లు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అసంతృప్తిని చల్లార్చేందుకు ఇప్పటికే ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. ఆమె నేతలందరితో మాట్లాడుతున్నారు. ఎన్నికల సమయం దగ్గరపడిందని, బహిరంగ వేదికలపై విమర్శలు వద్దని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవల రేవంత్ రెడ్డి తాను పది అడుగులు దిగేందుకైనా సిద్ధమేనని ప్రకటించారు. అంతా కలిసి ఉంటేనే అధికారం దక్కడానికి చాన్స్ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అయితే అధిష్టానం కూడా గెలిచేందుకు చేయాల్సిన ప్రయత్నాలన్ని చేస్తున్నది. ఇందుకోసం కర్ణాటకలో పార్టీకి ట్రబుల్ షూటర్ గా పేరున్న డీకే శివకుమార్ ను రంగంలోకి దించింది. ఆయన కూడా ఇప్పటికే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో మాట్లాడినట్లు సమాచారం.
పార్టీని విలీనం, పొత్తుతో అయినా ముందుకెళ్లాలని కోరినట్లు తెలుస్తున్నది. ముందునుంచి డీకే కుటుంబంతో తమకు సత్సంబంధాలు ఉన్నాయని ఇటీవల షర్మిల చెప్పింది. కర్ణాటకలో గెలుపు అనంతరం డీకే డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వయంగా వెళ్లి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ నేపథ్యంలోనూ ఇరువురి మధ్య అర్ధగంట పాటు చర్చలు జరిగినట్లు సమాచారం. విడిగా వెళ్తే బీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందని, కలిసి సాగితే కొంత సత్ఫలితాలు వస్తాయని డీకే సూచించినట్లుగా సమాచారం. అయితే కాంగ్రెస్ కు మరింత చేరువగా షర్మిల వచ్చినట్లేనని అంతా భావిస్తున్నారు.