తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చడంలో సీఎం జగన్ మొండి వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కార్యకర్తలు తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. అంగన్వాడీలు విజయవాడకు రాకుండా అడ్డుకునేందుకు పలు జిల్లాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఆదివారం అర్ధరాత్రి నుంచే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి పోలీస్టేషన్ పరిధిలో 40 మంది అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయగా వారు స్టేషన్లోనే నిరసనకు దిగారు.
నెల్లూరు జ నుంచి రెండు బస్సుల్లో బయలుదేరిన అంగన్వాడీలను కావలి పోలీసులు అడ్డుకున్నారు. బస్సులను కావలి పోలీస్ స్టేషన్కు తరలించారు. విజయవాడ ధర్నా చౌక్ వద్దకు ఆదివారం రాత్రే అంగన్వాడీలు భారీగా చేరుకుని నిద్రించారు. అక్కడి భారీగా చేరుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలిస్తున్నారు.ఏపీ వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాల ప్రతులను సీఎం జగన్ కు ఇచ్చేందుకు తరలిరావాలని ఇప్పటికే అంగన్వాడీ సంఘాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని రెండు విడతల్లో చేపట్టనున్నట్లు
సమాచారం.
మొదట విజయనగరం, ప్రకాశం, బాపట్ల, విశాఖపట్నం, అనకాపల్లి, పల్నాడు, అన్నమయ్య, తిరుపతి, నంద్యాల జిల్లాల కార్యకర్తలు, ఆయాలు సోమవారం విజయవాడకు చేరుకునేలా ప్రణాళిక రచించారు. మిగతా జిల్లాల వారు మంగళవారం వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈకార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు ప్రభుత్వం తనిఖీలు ముమ్మరంగా చేపట్టింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బయలుదేరిన కార్యకర్తలు, ఆయాలను పలుచోట్ల బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో అదుపులోకి తీసుకుంటున్నారు.