Pawan Decide : ఏపీలో ఎన్నికల సమరం మొదలైనట్లే కనిపిస్తున్నది. తెలంగాణ కంటే ముందుగానే ఏపీలో మరింత వేడి కనిపిస్తున్నది. ఇప్పటికే పార్టీల నేతల క్షేత్రస్థాయిలో కత్తులు నూరుతున్నారు. నువ్వా నేనా సై అంటూ ప్రకటనలు చేస్తున్నారు. దీంతో ఏపీలో పరిస్థితి రోజురోజుకూ వేడెక్కుతున్నది. పొత్తలతో వార్ వన్ సైడ్ చేస్తాయని అనుకున్న టీడీపీ, జనసేన ఇప్పుడు చేస్తున్న ప్రకటనలతో కొంత సంశయం ఏర్పడింది. వారాహి యాత్రలో తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ సీఎం అంటూ చేసిన ప్రకటన ఈ పొత్తులపైన అనేక అనుమానాలు రేకెత్తించింది. మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడనివ్వకూడదనేదే తన ఉద్దేశమని చెబుతూనే పవన్ ఈ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మరింత చర్చ ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తపైనే నడుస్తున్నది.
ఏకాభిప్రాయం మీదే సందేహం..
టీడీపీ జనసేన పొత్తులపై ఇప్పటికే పలుమార్లు పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలవాలనేది తన అభిప్రాయమని తెలిపారు. అయితే తన వ్యక్తిగత నిర్ణయమని, అన్ని పార్టీలు ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తేనే ఇది సాధ్యమవుతుందన్నారు. ఎన్నికలు దగ్గరపడ్డాకే పొత్తులపై ఒక స్పష్టత వస్తుందని, తన నిర్ణయాన్ని ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలకు చెప్పానని పేర్కొన్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబును రెండు, మూడు సార్లు కలిశానని దీనిపై చర్చించామని తెలిపారు.
సీఎం అవుతానని అన్నా..
అయితే పవన్ మాత్రం తన వారాహి యాత్రలో పదే పదే సీఎం అవకాశం ఇవ్వాలని అడగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీనిపై కూడా పవన్ ఓ క్లారిటీ ఇచ్చారు. అభిమానుల కోరిక మేరకే అలా అన్నాని చెప్పుకొచ్చారు. సీఎం అవ్వాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందని, అయితే అది ఎలా వస్తుందనేది కీలకమని చెప్పారు. కోట్ల మంది జీవితాలను నడిపించే ఆ పదవి అంటే ఎంతో అనుభవం కావాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎంతో అవగాహన ఉండాలన్నారు. జనసైనికులు సీఎం సీఎం అంటూ అరుస్తుంటే మాత్రమే వారికి ఉత్సాహాన్నిచ్చేలా అలా మాట్లాడానని తెలిపారు.అయితే అది కేవలం తమ పార్టీ వాళ్లు మాత్రమే అనుకుంటే సరిపోదని, రాష్ర్ట ప్రజలంతా ఆశీర్వదించాలని కోరారు.
రానున్న ఎన్నికల్లో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని కోరారు. ముందుంగా అసలు ఓటరు జాబితాలో పేరుందా లేదా చూసుకోవాలని పిలుపునిచ్చారు. పొత్తులపై అన్ని పార్టీలకు కొంత అవగాహన ఉందని చెప్పారు. ఇన్నిసార్లు చంద్రబాబును కలిసినా, సీట్ల గురించి ఇప్పటివరకు చర్చించలేదని తెలిపారు. రాష్ర్టంలోని వివిధ అంశాలపై మాత్రమే తమ మధ్య చర్చ జరిగిందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఉన్న పరిస్థితిని బట్టి ఈ సారి బరిలో నిలుస్తామని చెప్పారు. పొత్తులపై ఇప్పుడే నిర్ణయం ప్రకటించబోమని అంటూనే వైసీపీ కి ఈసారి 18 శాతం ఓట్లు తగ్గుతాయని తెలిపారు. అయితే పొత్తులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ర్ట వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వైసీపీలో కూడా కొంత ఉత్కంఠ నెలకొంది. మరి పవన్, చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉన్నాయో మరికొన్ని నెలల్లో తేలిపోనుంది.