– ఆచూకీ తెలిపినవారికి రూ. 2 కోట్లు రివార్డు ప్రకటించిన ఎఫ్ బిఐ
America Crime News : తొమ్మిదేళ్ల క్రితం అమెరికాలో ఓ వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచి చంపి పరారయ్యాడు. ఈ ఘటనలో నిందితుడు భద్రేశ్ కుమార్ చేతన్ బాయ్ పటేల్ ను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బి ఐ) టాప్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చింది. తాజాగా అతడి ఆచూకీ తెలిపినవారికి 2,50,000 డాలర్లు (సుమారు రూ. 2 కోట్లకు పైగా) ఇస్తామని ప్రకటించింది.
మేరీల్యాండ్ లోని హానోవర్ లో ఈ ఘటన 2015 ఏప్రిల్ 12న జరిగింది. భద్రేశ్ పటేల్ అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే ఓ డోనట్ దుకాణంలో పనిచేస్తుండేవారు. ఈ ఘటన జరిగిన రోజున వారిద్దరూ నైట్ షిఫ్ట్ లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత పాలక్ ను కత్తితో పొడిచి భద్రేశ్ పటేల్ పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పాలక్ అక్కడికక్కడే మృతి చెందింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎఫ్ బీఐ అధికారులు నిందితుడి కోసం తీవ్రంగా వెదికారు. హత్య చేసిన తర్వాత భద్రేశ్ తన అపార్ట్ మెంట్ కు వెళ్లి కొన్ని వస్తువు తీసుకుని న్యూజెర్సీ ఎయిర్ పోర్టుకు వెళ్లినట్లు సీసీ టీవి ఫుటేజీలను బట్టి తెలుస్తోంది. ఆ తర్వాత అతని జాడ లేకపోవడంతో 2017లో అతడిని టాప్ టెన్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఎఫ్ బీఐ చేర్చింది. తాజాగా రివార్డు ప్రకటించింది. నిందితుడు కెనడా లేదా భారత్ కు వెళ్లి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు.