2023 Roundup : భారతీయ జనతా పార్టీ తెలంగాణలో బలపడేందుకు శక్తికి మించి శ్రమిస్తోంది. ఇందుకోసం బలమైన క్యాడర్ ను తయారు చేస్తున్నది. గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైన కమలం పార్టీ ఆ తర్వాత పుంజుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018 ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన వారు పార్టీని అంతగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు. దీంతో ఒకటి, రెండు స్థానాలకే పరిమితమైంది.
మలుపు తిప్పిన ‘బండి’
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే బండి సంజయ్ కుమార్ రాజకీయంగా ఎదిగారు. చదువుకునే సమయంలో ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత భారతీయ యువ మోర్చా, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, జాతీయ కార్యదర్శిగా ఇలా వివిధ హోదాల్లో పని చేశారు. 2005లో ఏర్పడిన కరీంనగర్ నగర పాలక సంస్థ 48వ డివిజన్ కార్పొరేటర్ గా బీజేపీ తరఫున మూడుసార్లు విజయం సాధించారు. ఈ క్రమంలో బీజేపీ కరీంనగర్ అధ్యక్షుడిగా సేవలందించారు. ఈ క్రమంలో 2014, 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు.
అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి బీ వినోద్ కుమార్ పై 89 వేల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆ తర్వాత బీజేపీలో చురుకుగా వ్యవహరించిన బండి సంజయ్ సేవల్ని గుర్తించిన అధిష్టానం ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అప్పటి నుంచి బీజేపీ కార్యకర్తలు, నాయకుల్లో మంచి జోష్ నింపాడు. తన పదునైన పదజాలంతో బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టారు. సర్కారు తీసుకున్న ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన గళం విప్పారు. ఈ క్రమంలో తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్ష చేయగా, పోలీసులు భగ్నం చేశారు. అనంతరం విడుతల వారీగా పాదయాత్ర పేరిట తెలంగాణ నలుమూలాల కలియ తిరిగారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగారు. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో తన విమర్శల పదును పెంచారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేసే దిశగా పార్టీని బలోపేతం చేశారు.
అనూహ్యంగా తప్పించడంతో మారిన సీన్..
బీజేపీ గాలి తెలంగాణలో జోరందుకున్న సమయంలోనే అధిష్టానం కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించింది. 2020 మార్చి నుంచి 2023 జూలై వరకు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించారు. దీంతో బండి సంజయ్ అభిమానులు, కార్యకర్తలు ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. అధికారంలోకి వస్తుందనుకున్న పార్టీ 8 సీట్లతో మూడో స్థానానికి పరిమితం కాగా, అసలు పోటీలోనే లేని కాంగ్రెస్ అధికారం చేపట్టింది. ఇలా రాజకీయ సమీకరణాలు వేగంగా మారడంతో ఈసారైనా అధికారం చేపట్టాలని ఆశలు పెట్టుకున్న బీజేపీకి భంగపాటు తప్పలేదు.