Hyderabad :
ఒకరి నుంచి సాయం పొంది వీలైనంత వేగంగా వారిని మరిచిపోతున్న రోజులివి. కానీ ఒక మహిళ తన ప్రాణాలు కాపాడిన ఒక పోలీస్ ఆఫీసర్ ను చూసి గుర్తు పట్టి మరీ దగ్గరకు వచ్చి నన్ను కాపాడింది మీరే సార్ అంటూ చెప్పుకచ్చింది. ఆ పోలీస్ సార్ ను తొమ్మిదేండ్ల తర్వాత చూసిన ఆమె ఆనందానికి అవధుల్లేవు. బస్సులో నుంచి చూసిన ఆమె దిగి పరుగెత్తుకుంటూ వచ్చి కృతజ్ఞతలు తెలిపింది. ఈ రోజు తను బతికి ఉన్నానంటే మీరే కారణమని అతని కాళ్లపై పడి ఆనంద బాష్పాలు కార్చింది. ఈ సన్నివేశం అక్కడున్న హృదయాలను తాగింది.
ఆనాడు..
మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్ 2014లో టప్పాచబుత్రలో ఇన్స్పెక్టర్గా పని చేశారు. కార్వాన్ కు చెందిన కవిత కడుపులో గడ్డలు కాగా తీవ్ర నొప్పితో అనారోగ్యానికి గురైంది. ఆమె ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఆమెను పట్టించుకునే వాడు లేకపోవడంతో నరకయాతన అనుభవించేది. అప్పుడు ఇన్ స్పెక్టర్ గా ఉన్న రవీందర్ ఆమెను ఆసుపత్రిలో చేర్పించి సొంత డబ్బుతో ఆపరేషన్ చేయించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వివిధ స్టేషన్లకు బదిలీ అవుతూ వెళ్లారు. కాల క్రమంలో ఆయన ఈ విషయాన్ని మరిచిపోయారు.
ఈరోజు
రవీందర్ ను తన ప్రాణాలు కాపాడిన దేవుడిగా కొలుస్తూ సెల్ ఫోన్ వాల్ పేపర్ పై అతని ఫొటో పెట్టుకుంది. తొమ్మిదేండ్లు అయినా ఆయనను మరిచిపోలేదు. ఆయనకు రాఖీ కట్టాలని తను బతికి ఆనందంగా ఉన్నానని ఆయనకు తెలియాలని తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగా..
ఆదివారం కవిత పని చేసుకునేందుకు బస్సులో సికింద్రాబాద్కు వెళ్తుండగా.. ఆర్పీ రోడ్ దర్గా వద్ద విధుల్లో ఉన్నారు రవీందర్. చూసి గుర్తు పట్టిన ఆమె బస్సు కొంత దూరం వెళ్లాక సిగ్నల్ పడడంతో ఆగిపోవడంతో దిగింది. ఆయన వెళ్లిపోతారు కావచ్చని పరుగులు పెట్టింది. ఏసీపీ రవీందర్ వద్దకు వచ్చి కాళ్లకు దండం పెట్టింది. కానీ ఆయన ఆమెను గుర్తు పట్టేలేదు. ఎవరమ్మా అని అడగడంతో తాను పరిచయం చేసుకుంది. ‘సార్.. మీకు వెండి రాఖీ తీసుకొచ్చి కడతాను. ఫోన్ నంబరు ఇవ్వండి’ అంటూ అడిగి తీసుకొని వెళ్లిపోయింది.