- 500 మిలియన్ లీటర్ల కొరత రోజుకి..!
Alarm bells in Telugu States : కాంక్రీట్ జంగిల్ బెంగళూరులో రోజుకి 500 మిలియన్ లీటర్ల నీటి కొరత. షాపింగ్ మాల్స్, వర్క్ ప్లేసెస్, హోటల్స్, హాస్పిటల్స్, వాష్రూమ్స్ వాడుకుంటున్న ప్రజలు. అపార్ట్మెంట్స్ లో నీటికి రేషన్. వాటర్ ట్యాంకర్లకి హెవీ డిమాండ్. రోజుకి 500 రూపాయలు నీళ్ల కోసం ఖర్చు పెడుతున్న కుటుంబాలు. వర్క్ ఫ్రం హోం వెసులుబాటుతో స్వగ్రామాలకు కదిలిన టెక్కీలు.
కర్ణాటక కష్టాలు చూసిన ఉభయ తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ హైకోర్టు ఈ విషయమై స్పందించడం కొసమెరుపు. ఇప్పటి నుంచి అప్రమత్తమై తగిన చర్యలు తీసుకోండి. జల సంరక్షణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ మరో బెంగళూరు అవుతుందని హెచ్చరించడమే కాక నీటి సంరక్షణకు తీసుకోవలసిన చర్యలను సూచించింది. తీసుకున్న చర్యల అమలుపై మార్చి 26లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది.
వాస్తవానికి భాగ్యనగరంలో నీటి ఎద్దడి నేటి సమస్య కాదు 2005లోనే పి.ఆర్.సుభాష్ చంద్రన్ ప్రజాహితంగా హైకోర్టుకు రాసిన లేఖలో జంట నగరాలలో నీటి ఎద్దడి రాకుండా తగిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అమిక క్యూరీగా సీనియర్ న్యాయవాది డి.ప్రకాష్ రెడ్డిని నియమించింది. భవన నిర్మాణాలను తనిఖీ చేసిన న్యాయవాది వాటర్ బోర్డు అధికారులతో సమన్వయం చేసుకొని ఒక నివేదికను సమర్పించడం జరిగింది. ఆ నివేదికను న్యాయస్థానం తక్షణమే అమలు చేయాలని ఆదేశించడమే గాక పురోగతిని మార్చి 26 లోపు తెలియజేయమని ఆదేశించడంలోని ఆంతర్యం ఇదే!
వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించింది. మరో అడుగు ముందుకేసి దశదిశలా పెరుగుతున్న మహా నగరానికి 2050 నాటికి అవసరమైన తాగునీటి సరఫరాకు నేడే ప్రణాళికలు యుద్ధ ప్రాతిపదికన సిద్ధం చేయమని జలమండలికి పురమాయించారు. 2050 నాటికి నీటి ఎద్దడి రెండింతలు కానున్నది. అంటే రోజుకి 1000 మిలియన్ గ్యాలన్లు మించనున్నాయి. ఇందుకు కృష్ణా నుంచి 16.5 టీఎంసీలు, గోదావరి నుంచి 30 టీఎంసీలు, హైదరాబాద్ కి కేటాయించారు. ప్రస్తుతానికి గోదావరి నుంచి పది టీఎంసీలే తరలిస్తున్నారు. నేటి శుద్ధి ఏర్పాట్లు ఎల్లంపల్లి నుంచి నీటి సేకరణ ప్రణాళికలు శరవేగంతో కదులుతున్నాయి. ఇదే సమయంలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలలో 11.45 కోట్ల టన్నుల ఇసుక మేటపై కూడా దృష్టి సారించారు.
దీంతోపాటు ఢిల్లీ కాలుష్యం కూడా తెలంగాణ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. తెలంగాణలోని హోటళ్లు,రెస్టారెంట్లు, దాబాలు, బాయిలర్లు, ఫర్నేసులలో బొగ్గు, కట్టెలు వాడకాన్ని నిషేధించి క్లీనర్ ఫ్లూయెల్స్ (ఎల్పిజి తరహ ఇంధనాలు) వినియోగించాలని తీర్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హెచ్పీసీఎల్ కంపెనీ వారు ప్రభుత్వాన్ని సంప్రదించారు.
ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభుత్వం తాగునీటి విషయమై సత్వరమే స్పందించింది. రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరువరకు ఎక్కడా తాగునీటి సమస్య రాకుండా 115 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నింపడంతో పాటు, కుళాయిల ద్వారా రోజుకి ఒకసారి అయినా నీటి సరఫరా జరిగేలా చూడడానికి, బోర్ వెల్స్ కు మరమ్మత్తులు ఉంటే వెంటనే చేపట్టడానికి, నీటి ఎద్దడి ఆవాసాలకు ట్యాంకర్లతో నీటి సరఫరాకు మంచినీటి పథకాలను సత్వరమే పూర్తి చేయడానికి, తాగునీటి సరఫరాపై ఫిర్యాదులకు 1904 కాల్ సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరిగింది. తాగునీటి సమస్యపై ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు సత్వర చర్యలు చేపట్టడం అభినందనీయం.
– తోటకూర రఘు
ఆంధ్రజ్యోతి వీక్లీ మాజీ సంపాదకులు